ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజులే డ్యూటీ..ఇక్కడే ట్విస్ట్

  • Publish Date - February 12, 2020 / 05:36 PM IST

ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి కేవలం 5 రోజులు మాత్రమే డ్యూటీ చేస్తారు. వారం రోజుల్లో..అంటే..శని, ఆదివారాలు లీవ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే..ఇక్కడే ట్విస్ట్ ఉంది. మరో 45 నిమిషాల పాటు అదనంగా పని చేయాల్సి ఉంటుంది.

2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం సీఎం ఉద్దవ్ థాకరే అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలపై నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏడో రాష్ట్రంగా అవతరించింది. దాదాపు 20 లక్షల మంది అధికారులు, ఉద్యోగులకు ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు (30 నిమిషాల భోజన విరామం)తో సహా ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తుంటారు.

 

రెండవ శనివారం, నాలుగవ శనివారం సెలవులు లభిస్తాయి. కొత్త పని గంటల ప్రకారం ఉదయం 9.45 నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య (30 నిమిషాలు) భోజనం విరామం ఉంటుంది. ఐదు రోజుల కారణంగా విద్యుత్, నీరు, డీజిల్, పెట్రోల్ ఖర్చులు ఆదా అవుతాయని, అంతేగాకుండా..వారి వారి కుటుంసభ్యులతో ఆహ్లాదంగా గడపొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

పోలీసు, అగ్నిమాపక దళం, ప్రభుత్వ కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పారిశుధ్య కార్మికులు, ముఖ్యమైన సేవలకు ఇది వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. ఐదు పని దినాలు..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుందనే సంగతి తెలిసిందే. రాజస్థాన్, బీహార్, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఐదు రోజుల పనిదినాలు అమల్లో ఉంది. ఇటీవలే ఉద్దవ్ థాకరే అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.