UttarPradesh Bike thief: ఉత్తరప్రదేశ్ లో పోలీసుల ఎన్ కౌంటర్లకు నేరస్థులు భయపడిపోతున్నారు. నేరస్థులను ఎన్ కౌంటర్లలో పోలీసులు హతమార్చుతుండడంతో కొందరు తమకు తాముగా లొంగిపోతున్నారు. తాజాగా, ఓ దొంగ ప్లకార్డు పట్టుకుని వచ్చి మరీ పోలీసుల ముందు లొంగిపోయాడు.
“నన్ను క్షమించండి సీఎం యోగి.. నేను తప్పు చేశాను” అని చేతిలో ప్లకార్డు పట్టుకుని ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్, మన్సూర్ పూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు అంకుర్ అనే ఓ దొంగ. అతడు మోటార్ సైకిళ్లు చోరీ చేస్తున్న ముఠాకు చెందినవాడు. ఆ గ్యాంగ్ కోసం పోలీసులు వెతుకుతున్నాడు. భయపడిపోయిన అంకుర్ ఇలా ప్లకార్డు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
మరోసారి తాను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడబోనని పోలీసులకు చెప్పాడు. అతడిని కస్టడీలోని తీసుకున్న పోలీసులు జైలుకు పంపారు. అంకుర్ పలు కేసుల్లో ఉన్నాడని, హత్యాయత్నం కేసు కూడా అతడిపై ఉందని పోలీసులు తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు యూపీలో 9,000 ఎన్ కౌంటర్లు జరిగాయి. పోలీసుల చేతిలో హతమైన వారిలో 160 మంది అనుమానిత నేరస్థులు కూడా ఉన్నారు.