Oscar Fernandes : కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్(80) కన్నుమూశారు. 

Oscar

Oscar Fernandes కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్(80) కన్నుమూశారు.  ఆస్కార్ ఫెర్నాండెజ్ కొద్దికాలంగా కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఎనెపోయా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయనకు డయాలసిస్ చికిత్స చేస్తుండగా ఓసారి బాగా తలనొప్పి రావడంతో ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆయనకు శరీర అంతర్గత అవయవాల్లో గాయాలు ఉన్నట్టు గుర్తించారు.

ఈ ఏడాది జులై 18న ఫెర్నాండెజ్.. తన ఇంట్లో యోగా చేస్తుండగా.. ఆసనంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు​. ఆ సమయంలో భౌతికంగా ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ రోజువారీ చెకప్​లో భాగంగా హాస్పిటల్ కి వెళ్లగా.. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి ట్రీట్మెంట్ అందించారు. దీనికి చికిత్స తీసుకుంటుండగా సోమవారం అయన తుది శ్వాస విడిచారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల ప్రధాని మోడీ,మాజీ ప్రధాని దేవీ గౌడ,కాంగ్రెస్ నేతలు సహా పలువురు సంతాపం ప్రకటించారు

ఆస్కార్​ ఫెర్నాండెజ్​.. 1941 మార్చి 27న ఉడిపిలో జన్మించారు. 12మంది సంతానంలో ఆయన ఒకరు. చిన్నప్పటి నుంచి క్యాథలిక్​ ఆచారాల మధ్య పెరిగారు. ఆయనకు బ్లాసమ్​ ఫెర్నాండెజ్​తో వివాహమైంది. ఆయనకు ఇద్దరు సంతానం.

1980 లో కర్ణాటకలోని ఉడిపి నియోజకవర్గం నుండి ఆస్కార్ ఫెర్నాండెజ్ తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుండి 1984, 1989, 1991, 1996 లో లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. 1998 లో ఫెర్నాండెజ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 లో ఎగువ సభకు తిరిగి ఎన్నికయ్యారు. ఫెర్నాండెజ్ యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ ఫెర్నాండెజ్​ పనిచేశారు.  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా ఉన్న ఫెర్నాండెజ్, రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా కూడా పనిచేశారు.

READ Jet Airways : మళ్లీ గాల్లో ఎగరనున్న జెట్ ఎయిర్ వేస్