జమ్ముకశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత జవాన్లను కవ్విస్తునే ఉన్నారు. పుల్వామా దాడి తరువాత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. తుపాకులు ఎప్పుడు ఘర్జిస్తాయో తెలీక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఏ తూటా వచ్చి శరీరంలో దూసుకుపోతుందోనని భయాందోళనలతో జీవిస్తున్నారు.
ఈ క్రమంలో హంద్వారా పరిసర ప్రాంతాలలో మూడవ రోజు కూడా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. హంద్వారాల జిల్లా బాబాగుంద్లో గడిచిన 60 గంటల్లో..ఉగ్రవాదులకు..సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇద్దరు పోలీసులు మృతిచెందారు. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. పూంచ్ సెక్టార్ లో ఫిబ్రవరి 2న జరిగిన కాల్పుల్లో ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. దీంతో బాంబు దాడులతో స్థానికులు ఆ ప్రాంతంలోని నివాసాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.