Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. దేశంలో నంబర్ వన్ రిచెస్ట్ మాన్ అతనే!

అదానీ గ్రూప్‌ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్‌‌లో మొదటి స్థానంలో నిలిచాడు

  • Updated on- January 26, 2022 / 03:01 PM IST

Gautam Adani Become Richest Indian

Gautam Adani Become Richest Indian: అదానీ గ్రూప్‌ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్‌‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ రియల్ టైమ్ డేటా నెట్‌వర్త్ జాబితా ప్రకారం, ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ మొదటి స్థానంలోకి చేరుకున్నాడు. గౌతమ్ అదానీ సంపద ముఖేష్ అంబానీని మించిపోయింది.

గౌతమ్ అదానీయే టాప్:
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజులుగా భారీ పతనం నమోదవగా.. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ కారణంగానే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నికర విలువ భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో, అదానీ గ్రూప్ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. దీంతో గౌతమ్ అదానీ నికర విలువ అలాగే ఉండిపోయింది. జనవరి 25వ తేదీన అంటే.. నిన్న గౌతమ్ అదానీ సంపాదన ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టేయగా.. భారతదేశపు అత్యంత సంపన్నుడిగా అయ్యారు అదానీ.

గౌతమ్ అదానీ సంపద 90 బిలియన్ డాలర్లు.. అంటే రూ. 6.72 లక్షల కోట్లు కాగా, ముఖేష్ అంబానీ నికర విలువ 89.8 బిలియన్ డాలర్లు అంటే రూ. 6.71 లక్షల కోట్లకు చేరుకుంది. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నంబర్ వన్ స్థానంలో చాలాకాలం నుంచి అంబానీ ఉన్నారు. భారత్‌లో గట్టి పోటీ వీరిద్దరి మధ్య కనిపిస్తోంది.

సంపాదన పరంగా అదాని ప్రపంచంలో 11వ స్థానంలో ఉండగా.. జనవరిలో, అదానీ గ్రూప్ కంపెనీల నికర విలువ 6 శాతం నుండి 45 శాతానికి పెరిగింది, అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గత రెండు రోజుల్లో భారీగా పడిపోయాయి. దీంతో ముకేశ్ అంబానీ కంటే అదానీ భారత్‌లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.