Vellappally Natesan on culture: కేరళలో కీలకమైన ‘హిందూ ఎజావా కమ్యూనిటీ’ నేత, సీఎం పినరయి విజయన్ కు అత్యంత సన్నిహితుడు వెల్లపల్లి నటేశన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యాలయాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే తరగతి గదిలో కూర్చోవడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని చెప్పారు. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ ‘జండర్ న్యూట్రల్ పాలసీ’ గురించి వెల్లపల్లి నటేశన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘తరగది గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపబోము. మనకు మన సొంత సంస్కృతి ఉంది. మనం అమెరికాలోనో, ఇంగ్లండ్లోనో నివసించడం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కలిసి కూర్చోవడం వంటి చర్యలను మన సంస్కృతి ఒప్పుకోదు’ అని వ్యాఖ్యానించారు.
‘విద్యా సంస్థలు మంచి గ్రేడ్లను సాధించలేకపోతుండడానికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి నిధులు పొందలేకపోతుండడానికి ఇటువంటి తీరే ఓ కారణం. కాలేజీల్లో 18 ఏళ్ళలోపు అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటోన్న సమయంలో కలిసి కూర్చోవద్దు, కౌగిలించుకోవద్దు. ఒక వయసు దాటాక పిల్లలు తమకు ఇష్టం వచ్చిన పని చేస్తుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడం అనేది మన దేశానికి ప్రమాదకరం’ అని వెల్లపల్లి నటేశన్ అన్నారు.