Goa Forest Fire: గోవాలో దావానలం.. తగలబడుతున్న అడవులు.. ప్రధాని మోదీ సమీక్ష
వారం రోజుల క్రితం మొదలైన మంటలు ఇంకా తగ్గడం లేదు. దీంతో స్థానికులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ పూర్తి ఫలితాన్నివ్వడం లేదు. మంటలు తీరంలోని ఇతర అడవులకు వ్యాపిస్తున్నాయి. ఒకచోట మంటలు అదుపులోకి వచ్చే సమయానికి ఇంకో చోట మంటలు అంటుకుంటున్నాయి.
- Narender Thiru
- Published On : March 11, 2023 / 06:18 PM IST
Goa Forest Fire: గోవాలో దావానలం అడవుల్ని దగ్ధం చేస్తోంది. వారం రోజుల నుంచి అక్కడి అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వారం రోజుల క్రితం మొదలైన మంటలు ఇంకా తగ్గడం లేదు. దీంతో స్థానికులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ పూర్తి ఫలితాన్నివ్వడం లేదు.
మంటలు తీరంలోని ఇతర అడవులకు వ్యాపిస్తున్నాయి. ఒకచోట మంటలు అదుపులోకి వచ్చే సమయానికి ఇంకో చోట మంటలు అంటుకుంటున్నాయి. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న పలు అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. సైనిక హెలికాప్టర్ల ద్వారా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్, నేవీ ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఈ అంశంపై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు గోవా అటవీ శాఖ మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు. మంటలను అదుపు చేసేందుకు కేంద్రం అన్ని రకాలుగా సాయం అందిస్తోందని ఆయన చెప్పారు.
Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం.. పోలీస్ కేసు నమోదు
ప్రస్తుతం సైనిక హెలికాప్టర్లతోపాటు 500 మందికిపైగా సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది అడవుల్లో మంటలు ఆర్పేశారు. వాటిలో నాలుగు అడవుల్లో తిరిగి మంటలు మొదలయ్యాయి. మరో 11 అడవుల్లో కొత్తగా మంటలు ప్రారంభమయ్యాయి. ఈ అడవులు తగలబడిపోవడానికి ప్రకృతి కంటే మనుషులే కారణం అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అడవులు భారీగా తగలబడిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ గోవాలో ఈ స్థాయిలో అడవులు దగ్ధం కాలేదని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, అనేక జీవుల ప్రాణాలకు ముప్పు ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
