Govt Hikes Subsidies For Dap Other Non Urea Fertilisers
Subsidies For Fertilisers ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువులపై బస్తాపై ఇస్తున్న సబ్సిడీ పెంపుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా..డీఏపీ ఎరువులపై ప్రభుత్వం రాయితీని 50 కేజీల బస్తాకు రూ. 700 రూపాయలకు పెంచినట్లు తెలిపారు.
వ్యవసాయ క్షేత్రంలో విరివిగా వాడే డీఏపీ ఎరువుల బస్తాపై ఇప్పటివరకు ఇస్తున్న రాయితీని 500 నుంచి 12వందల రూపాయలకు పెంచినట్లు మాండవియా తెలిపారు. దీంతో ఇకపై రైతులు..రూ.1200కే డీఏపీ బస్తా పొందుతారన్నారు. ఈ నిర్ణయంతో ఖజానాపై రూ .14,775 కోట్ల భారం పడుతుందని మాండవియా తెలిపారు. కరోనా వేళ రైతులకు కొంత ఉపశమనం కల్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ మన రైతులకు తక్కువ ధరకే ఇవి అందుతాయన్నారు.
కాగా, గతేడాది 17వందలు ఉన్న డీఏపీ 50కేజీల బస్తా ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 2వేల 400కు చేరింది. ఈ నేపథ్యంలో గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఏపీపై ఇస్తున్న రాయతీని 140 శాతం పెంచాలని నిర్ణయించారు. ఇవాళ జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో యూరియాపై ఇస్తున్న రాయితీని మరో 700 పెంచారు. ఫలితంగా 2వేల 400 ఉన్న డీఏపీ బస్తా 12వందలకే రైతులకు అందుబాటులోకి రానుంది.