100% Staff in Offices: జూన్ 7 నుంచి అందరూ ఆఫీసులకూ రావాల్సిందే..!
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్నివారాల్లో కరోనా కేసులు గణనీయంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించింది.
- Sreehari A
- Updated on- June 5, 2021 / 12:14 AM IST
Gujarat Allows All Offices To Function With 100 Staff From June 7
100% Staff in Offices : గుజరాత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్నివారాల్లో కరోనా కేసులు గణనీయంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. అంతేకాదు.. జూన్ 7 నుంచి 100శాతం సిబ్బందితో ఆఫీసుల్లో పనిచేయడానికి అనుమతించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసుల్లో జూన్ 7 నుంచి వంద శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించనున్నట్టు గుజరాత్ సమాచార విభాగం పేర్కొంది.
ఇప్పటివరకూ ప్రైవేట్, ప్రభుత్వం ఆఫీసుల్లో గుజరాత్ 50మంది సిబ్బందితో మాత్రమే పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మంది సిబ్బందితో మాత్రమే అనుమతినిచ్చింది. గత రెండు వారాల్లో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. దాంతో వంద శాతం సిబ్బందికి అనుమతినిస్తున్నట్టు వెల్లడించింది.
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే షాపులను తెరిచేందుకు అనుమతించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని 36 నగరాల్లోని అన్ని దుకాణాలను శుక్రవారం (జూన్ 4)న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరవడానికి అనుమతించారు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్ల ద్వారా హోమ్ డెలివరీ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
గుజరాత్ ప్రభుత్వం జూన్ 11 వరకు లాక్డౌన్ పొడిగించగా.. COVID-19 లాక్డౌన్ పరిమితులను సడలించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూను జూన్ 4 నుండి జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్లు సీఎంఓ ప్రకటించింది. గుజరాత్లో గురువారం (జూన్ 3) వరకు 1,207 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,13,270 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.గుజరాత్లో ఇప్పుడు 24,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 17 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 9,890కు చేరుకుంది.
