Gujarat Parivartan Sankalpa Yatra: కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపటి నుంచి ‘గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్ర’
కాంగ్రెస్.. రేపటి నుంచి గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమం సోమవారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆదివారం రాత్రి మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన నేపథ్యంలో యాత్రను మంగళవారంకు వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
- Harishth Thanniru
- Published On : October 31, 2022 / 10:58 AM IST
Gujarat Parivartan Sankalp Yatra
Gujarat Parivartan Sankalpa Yatra: గుజరాత్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందుకు సన్నద్ధమవుతోంది. ఆ రాష్ట్రంలోని బలమైన అధికార పార్టీ బీజేపీని ఢీకొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్.. రేపటి నుంచి గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమం సోమవారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆదివారం రాత్రి మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన నేపథ్యంలో యాత్రను మంగళవారంకు వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
pm Modi : గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
అంతకుముందు అక్టోబర్ 31న (సోమవారం) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి జ్ఞాపకార్థం వడ్గామ్, భుజ్, సోమంత్, ఫగ్వెల్, జంబూసర్ నుండి యాత్రను ప్రారంభించాలని పార్టీ ప్లాన్ చేసింది. అనుకోని పరిస్థితుల్లో సోమవారం యాత్ర వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే గుజరాత్ పరివర్తన్ సంకల్ప యాత్రలో 145 బహిరంగ సభలు, 95 ర్యాలీలు ఉంటాయి. యాత్ర 5,432 కి.మీ.లు 45 మిలియన్ల మందితో ‘ప్రత్యక్ష పరిచయాన్ని’ ఏర్పరచుకునే లక్ష్యంతో సాగుతుందని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ తెలిపారు. ఈ యాత్రలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే 11 హామీలను నెరవేరుస్తుందని ప్రజలకు తెలియజేయాలని యోచిస్తోందని ఠాకూర్ చెప్పారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ సహా పలువురు సీనియర్ పార్టీ నేతలు ఈ యాత్రలో పాల్గొంటారు. భుజ్-రాజ్కోట్ యాత్రను దిగ్విజయ్ సింగ్ ప్రారంభించనుండగా సోమనాథ్ పాద యాత్రను కర్ణాటక నేత బీకే హరిప్రసాద్ ప్రారంభించనున్నారు గెహ్లాట్ బనస్కాంత జిల్లాలోని వడ్గామ్ నుండి, ఖేడా జిల్లాలోని ఫగ్వెల్ నుండి పైలట్, దక్షిణ గుజరాత్లోని భరూచ్ జిల్లాలోని జంబూసర్ నుండి పవన్ ఖేరా నుండి యాత్రను ప్రారంభిస్తారు.
