Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 4 వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలపై సీబీఐ అధికారులు సిసోడియాను విచారిస్తున్నారు.
అక్కడ ఆయనను సీబీఐ ప్రత్యేక సదుపాయాలు కలిగిన లాకప్లో ఉంచి విచారిస్తోంది. ఆయనకున్న స్థాయి దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక సదుపాయాల్ని అధికారులు కల్పిస్తున్నారు. సాధారణ ఖైదీల్లా కాకుండా ప్రత్యేకంగా ఆయనకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. సిసోడియా తన లాయర్ను రోజూ రెండు సార్లు కలిసే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల్ని రోజుకోసారి, పదిహేను నిమిషాలపాటు కలవడానికి అనుమతి ఉంటుంది. వ్యక్తిగత గోప్యత ఉండేలా వారిని కలుసుకునేందుకు అనుమతి ఉంటుంది. జైలులో ఆయనకు బ్రేక్ఫాస్ట్, లంచ్, శ్నాక్స్, డిన్నర్ అందజేస్తున్నారు. ఆహారంతోపాటు ఇతర సదుపాయాలు కూడా అందజేస్తున్నారు.
శుభ్రంగా ఉన్న బాత్రూమ్, షవర్, న్యూస్ పేపర్స్, పరుపు, పిల్లో వంటివి కూడా ఇచ్చారు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న మనీశ్.. మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు, ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. వీటిని కేజ్రీవాల్ ఆమోదించారు. సత్యేందర్ మనీ లాండరింగ్ కేసులో పది నెలలుగా జైలులో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీశ్ సిసోడియా వ్యవహారంపై తదుపరి విచారణ ఈ నెల 10న జరగనుంది.