Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన సీఎం భార్య
గతంలో ఆప్ నేత మనీశ్ సిసోడియాపై కూడా రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు.
- T Venkateshwarlu
- Published On : September 23, 2023 / 03:56 PM IST
Riniki Bhuyan Sarma
Riniki Bhuyan Sarma – Himanta Biswa Sarma: కాంగ్రెస్ (Congress) ఎంపీ గౌరవ్ గొగొయి(Gaurav Gogoi)పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ, రినికి భుయాన్ శర్మ సబ్సిడీ తీసుకున్నారంటూ ఎంపీ గౌరవ్ గొగొయి తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ఆమె తరఫు న్యాయవాది దేవజిత్ సైకియా చెప్పారు. కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఆఫ్ కామ్రూప్ మెట్రోపాలిటన్ లో ఈ దావాను శుక్రవారం వేసినట్లు వివరించారు.
దీనిపై సెప్టెంబర్ 26న కోర్టు విచారణ జరపనున్నట్లు చెప్పారు. తన క్లయింట్ పై గౌరవ్ గొగొయి ట్విటర్ లో పలు రకాలుగా ట్వీట్లు చేశారని తెలిపారు. గతంలో ఆప్ నేత మనీశ్ సిసోడియాపై కూడా రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు.
కాగా, గౌరవ్ గొగొయి సెప్టెంబరు 12న ఓ ట్వీట్ చేశారు. ‘ప్రధాన మంత్రి మోదీ జీ.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి మీ ప్రభుత్వం రూ.10 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఇదే మన్న రేవ్డీనా? రబ్రీనా? ప్రజలు పన్నులు కడుతున్నది ఇందుకేనా?’ అని నిలదీశారు.
DK Shivakumar: ఎన్డీఏలో చేరిన జేడీఎస్కు డీకే శివకుమార్ ఏం చెప్పారో తెలుసా?
