అయోధ్య తీర్పుపై స్పందించిన అద్వాణీ

దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై ఈ రోజు(నవంబర్-9,2019) ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్వాగతించారు. తీర్పుపై శనివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. దేశ స్వాతంత్య్ర  పోరాటం తరువాత అయోధ్య రామమందిరం కొరకు సాగిన ఉద్యమమే ఉన్నతమైనది. దానిలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం వచ్చిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ తీర్పుతో అద్వానీ కళ సాకారమైందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించాలని అద్వానీ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. మందిర నిర్మాణం కొరకు గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు రథయాత్ర సైతం చేపట్టారు. ఆయన చేపట్టిన యాత్రతోనే మందిర నిర్మాణం ఉద్యమం ఊపందుకుంది. అద్వానీ బాటలోనే నడిచిన పలు హిందూసంఘాలు మందిర నిర్మాణం కొరకు మరింత ఉధృతంగా పోరాటం సాగించాయి. అయితే రథయాత్ర ముగింపు సందర్భంగానే కరసేవకులు అయోధ్యంలోని బాబ్రీ మసీదును ధ్వసం చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో అ‍ద్వానీ సీబీఐ విచారణను కూడా ఎదుర్కొన్నారు. కాగా దశాబ్దాలుగా సాగిన అయోధ్య వివాదానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేటి తీర్పుతో ముగింపు పలికింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. అయోధ్యలోనే ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు ప్రభుత్వమే 5ఎకరాలు కేటాయించాలని కోర్టు ఆదేశించింది.