కాంగ్రెస్‌కు ఐటీ నోటీసు; బీజేపీ ట్యాక్స్ టెర్రరిజం పాలిటిక్స్ చేస్తోందన్న హస్తం పార్టీ

బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లాన్‌లో భాగంగా వచ్చిన ఐటీ నోటీసులకు భయపడేది లేదంటున్న కాంగ్రెస్, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ వసూలు చేసిన 8 వేలా 2 వందల కోట్లు మాటేంటని ప్రశ్నిస్తోంది.

Income Tax Notice to Congress: కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అకౌంట్ల ఫ్రీజ్ ఇష్యూ మరవకముందే ఇప్పుడు ఐటీశాఖ ఇచ్చిన నోటీసులు ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆదాయ పన్నుశాఖ 18 వందల 23 కోట్ల బకాయి పన్ను రికవరీ కోసం కాంగ్రెస్‌కు నోటీసులు ఇచ్చింది. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీని కలిపి పన్ను రికవరీ చేయాల్సి ఉందని నోటీసులో మెన్షన్ చేసింది ఐటీశాఖ.

ఇక 2014-15, 2015-16, 2016-17 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి.. రీఅసెస్‌మెంట్‌ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను మార్చి 22న కోర్టు కొట్టేసింది. ఈ రీఅసెస్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది.

ఐతే బీజేపీ ట్యాక్స్ టెర్రరిజం పాలిటిక్స్ చేస్తోందని మండిపడుతోంది కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకే బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని, ఆదాయపు పన్ను చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నారు ఏఐసీసీ లీడర్లు.. బీజేపీ కూడా 4వేలా 600 కోట్లకు పైగా పన్ను కట్టాల్సి ఉందనేది వారి మాట.

Also Read: సునీతా కేజ్రీవాల్ మరో రబ్రీదేవి కాబోతున్నారా? పార్టీని, ఢిల్లీ పీఠాన్ని నడిపించే నారీ శక్తి ఆమేనా?

బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లాన్‌లో భాగంగా వచ్చిన ఐటీ నోటీసులకు భయపడేది లేదంటున్న కాంగ్రెస్, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ వసూలు చేసిన 8 వేలా 2 వందల కోట్లు మాటేంటని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీసేందుకు చేసే ప్రయత్నాలను వచ్చే ఎన్నికల్లో జనమే తిప్పికొడ్తారని అంటున్నారు. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ డిమాండ్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్.

ట్రెండింగ్ వార్తలు