భారత్ దెబ్బకు తోక ముడిచిన డ్రాగన్..పాంగాంగ్ లేక్ వద్ద బలగాల ఉపసంహరణ
- venkaiahnaidu
- Published On : February 10, 2021 / 06:48 PM IST
Chinese Defence Ministry చైనా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు లేదా వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం(ఫిబ్రవరి-10,2020)చైనా రక్షణశాఖ ప్రకటించింది. పాంగాంగ్ తో సరస్సుకి దక్షిణ మరియు ఉత్తరం వైపు ఉన్న తమ బలగాలను భారత్-చైనా దేశాలు ఇవాళ్టి(ఫిబ్రవరి-10,2021) నుంచి ఉపసంహరించుకోవటం ప్రారంభించాయని చైనా రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ వూ కియాన్ ఓ రాతపూర్వక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇరు దేశాల సరిహద్దు వద్ద నెలకొన్న ప్రతిష్ఠంభణ విషయమై గత నెలలో మోల్డో-చుషుల్ సరిహద్దులో చైనా వైపు జరిగిన తొమ్మిదవ రౌండ్ మిలటరీ కమాండర్ స్థాయి చర్చల తర్వాత వచ్చిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా ఈ చర్య జరిగినట్లు తెలిపారు. కాగా,తొమ్మిదవ రౌండ్ చర్చలు సానుకూలంగా, ప్రాక్టికల్ గా,నిర్మాణాత్మకంగా ముగిసినట్లు గత నెలలో భారత్ పేర్కొన్న విషయం తెలిసిందే.
తూర్పు లఢఖ్ లోని వాస్తవాధీన రేఖ(LAC)వద్ద ఉద్రికత్తలు తగ్గించడం మరియు నెలల తరబడి కొనసాగుతున్న సైనిక ప్రతిష్ఠంభణను తొలగించాలనే లక్ష్యంతో 15గంటలకు పైగా సాగిన తొమ్మిదవ రౌండ్ చర్చల్లో పురోగతి కన్పించిందని.. వీలైనంత తర్వగా బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు జనవరిలో భారత్ తెలిపింది.
