PepsiCo : పెప్సికో కంపెనీకి భారత్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిప్స్ తయారీకి వాడే ప్రత్యేక రకం బంగాళాదుంప వంగడంపై పేటెంట్ రద్దైంది. ఈ మేరకు మొక్కల రకాలు మరియు రైతుల హక్కుల రక్షణ (PPVFR) అథారిటీ శుక్రవారం తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిప్స్ తయారీలో ఉపయోగించే FC5 అనే బంగాళాదుంప వంగడాన్ని 2009లో భారత్లోకి తీసుకొచ్చింది పెప్సీకో కంపెనీ. 2016లో ఈ వెరైటీ వంగడం మీద.. ‘పీపీవీ అండ్ ఎఫ్ఆర్ చట్టం 2001’ ప్రకారం అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది.
చదవండి : Dahi Kachori : కుటుంబం ఆకలి తీర్చటానికి..‘దహీ కచోరీ’అమ్ముతున్న బాలుడు..
FC5 బంగాళదుంప వంగడంపై రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తమపేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఒప్పంద రైతులు తప్ప ఇతర రైతులెవరూ దీనిని పండించవద్దని పెప్సికో కంపెనీ వాదిస్తూ వస్తుంది. అయితే ఈ వంగడం పండించేందుకు భారత దేశానికి చెందిన 12 వేలమంది రైతులతో పెప్సికో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం వారు పండించిన పంటను పెప్సికోకే అమ్మాల్సి ఉంటుంది. అయితే తమ ఒప్పందం పరిధిలో లేని తొమ్మిది మంది గుజరాత్ రైతులు ఈ వంగడం పండించారు. ఈ విషయం పెప్సికో దృష్టికి వెళ్లడంతో దీనిపై ఆ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అందులో నలుగురు చిన్న రైతులపై 4.2 కోట్ల రూ.కు దావా వేసింది. ఆ తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని దావాను వెనక్కు తీసుకుంది.
చదవండి : Gujarat : ట్రాన్స్ జెండర్ గా సర్టిఫికేషన్ పొందిన తొలి మహిళ ఈమె!
ఆ వెంటనే రైతు ఉద్యమకారిణి కవితా కురుగంటి FC5 బంగాళాదుంప వంగడంపై పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ PPVFR ముందు ఒక అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. రైతుల విత్తన స్వేచ్ఛను ఉల్లంఘించకుండా ఇతర విత్తన, ఆహార సంస్థలను కూడా నిలువరించాలని ఈ సందర్భంగా PPVFRను రైతుల తరపున కవిత కురుగంటి కోరారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న PPVFR.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. ఈ రిజిస్ట్రేషన్ రద్దుతో రైతులకు ఉపశమనం కలిగినట్లైంది.