Bullet Train India: బుల్లెట్ ట్రైన్ లో ఖతర్నాక్ టెక్నాలజీ.. జర్నీలో భూకంపం వస్తే..
భారతీయ రైల్వే వ్యవస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా నిలిచిన ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (Bullet Train India)కారిడార్ ప్రస్తుతం సరికొత్త సాంకేతిక విప్లవంతో రూపుదిద్దుకుంటోంది.
- V Santhosh Kumar
- Published on- July 24, 2026 / 02:56 PM IST
indian govt using electrification 2x25kv system mumbai ahmedabad bullet trainindian govt using electrification 2x25kv system mumbai ahmedabad bullet train
- వేగవంతమైన విద్యుదీకరణ వ్యవస్థ
- అత్యంత అధునాతన భద్రత
- మేక్ ఇన్ ఇండియా
Bullet Train India: భారతీయ రైల్వే వ్యవస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా నిలిచిన ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ ప్రస్తుతం సరికొత్త సాంకేతిక విప్లవంతో రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే మొదటిసారిగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే బుల్లెట్ రైలు కోసం ఏకంగా 508 కిలోమీటర్ల సుదీర్ఘ మార్గంలో విద్యుదీకరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండు నగరాల మధ్య ఉన్న 7 గంటల ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటల కంటే తక్కువకు తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది. ఇందులో భాగంగా సివిల్ నిర్మాణాలు, వియాడక్ట్లు, సొరంగాలు, ట్రాక్ లేయింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులన్నీ ఒకేసారి సమాంతరంగా వేగవంతం కావడం విశేషం.
ఈ కారిడార్ కోసం భారతదేశంలో మునుపెన్నడూ ఉపయోగించని అత్యంత శక్తివంతమైన 2×25 kV ఓవర్హెడ్ ట్రాక్షన్ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నారు. రైళ్లకు(Bullet Train India) నిరంతర విద్యుత్ను అందించడానికి మహారాష్ట్రలో 5, గుజరాత్లో 9 చొప్పున మొత్తం 14 ట్రాక్షన్ సబ్స్టేషన్లను నేషనల్ గ్రిడ్కు అనుసంధానిస్తున్నారు. డిపోలతో కలిపి మొత్తం 1,125 ట్రాక్ కిలోమీటర్ల పరిధిలో 10.5 నుండి 14.5 మీటర్ల ఎత్తున్న దాదాపు 22,000 స్టీల్ మాస్ట్లను నిర్మిస్తున్నారు. రైలు 320 కిమీ వేగంతో వెళ్తున్నప్పుడు విద్యుత్ వైర్లు ఏమాత్రం సాగిపోకుండా ఉండేందుకు 25,700 క్యాంటిలీవర్ అసెంబ్లీలను అమర్చుతున్నారు. అలాగే, భూకంపాలను సెకన్లలో పసిగట్టి రైలును స్వయంచాలకంగా నిలిపివేసేలా 28 అధునాతన సిస్మోమీటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్లో మరొక కీలకమైన అంశం ఏంటంటే, ‘మేక్ ఇన్ ఇండియా’. ట్రాన్స్ఫార్మర్లు, క్రాస్ ఆర్మ్స్, గ్రౌండ్, ఫీడర్ వైర్లు, ట్రాక్షన్ పవర్ సప్లై సిస్టమ్స్ వంటి అత్యంత కీలకమైన భాగాలను ఇప్పుడు భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, భవిష్యత్ మౌలిక వసతుల ప్రాజెక్టులకు మన దేశంలోనే స్వదేశీ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ మొత్తం 508 కిలోమీటర్ల ఎలక్ట్రికల్ నెట్వర్క్ను ఒకే సెంట్రలైజ్డ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు. విద్యుత్ లోపాలు లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైన క్షణాల వ్యవధిలోనే స్వయంచాలక వ్యవస్థ స్పందించి గరిష్ట భద్రతను నిర్ధారిస్తుంది.
