Israel-Hamas Conflict Horror : గాజాలో పెరిగిన మృతుల సంఖ్య, ఐస్క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు
ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా నగరంలో మృతదేహాలను ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారింది....
- saleem sk
- Published On : October 16, 2023 / 05:36 AM IST
Gaza Stores Bodies In Ice Cream Trucks
Israel-Hamas Conflict Horror : ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా నగరంలో మృతదేహాలను ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారింది. మృతదేహాల ఖననం చేసేందుకు స్మశానవాటికల్లో స్థలం తక్కువగా ఉంది. దీంతో హమాస్ ఆధ్వర్యంలోని గాజా స్ట్రిప్లోని ఆరోగ్య అధికారులు మృతదేహాలను ఐస్క్రీమ్ ఫ్రీజర్ ట్రక్కులలో భద్రపరిచారు.
ఐస్ క్రీం ఫ్రీజర్లు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్కు ఎదురుదెబ్బ కొట్టేందుకు గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ తీవ్ర బాంబు దాడులు సాగిస్తోంది. ఆసుపత్రి మార్చూరీల్లో 10 మృతదేహాలను మాత్రమే భద్రపర్చగలరు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో వారి మృతదేహాలను భద్రపర్చడం కోసం ఐస్ క్రీం ఫ్యాక్టరీల నుంచి ఐస్ క్రీం ఫ్రీజర్లను తీసుకువచ్చామని డీర్ అల్-లోని షుహాదా అల్-అక్సా ఆసుపత్రికి చెందిన డాక్టర్ యాసర్ అలీ చెప్పారు.
తాత్కాలిక శవాగారాలుగా ఐస్ క్రీం ఫ్రీజర్ ట్రక్కులు
పిల్లలకు ఐస్ క్రీం కోన్లను అందించే ఐస్ క్రీం ఫ్రీజర్ ట్రక్కులు మృతదేహాలను భద్రపర్చే తాత్కాలిక శవాగారాలుగా మారాయి. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 2,300 మందికి పైగా మరణించారని, వారిలో నాలుగింట ఒక వంతు మంది పిల్లలున్నారని గాజా అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 10,000 మంది గాయపడ్డారని చెప్పారు. ఆసుపత్రులు సామాగ్రి కొరతను ఎదుర్కొంటున్నాయి.
Also Read :Israel-Gaza war : నీటి కొరతతో రోజుల తరబడిగా స్నానం చేయని గాజా వాసులు
పెరుగుతున్న క్షతగాత్రుల సంఖ్యతో వారికి చికిత్స అందించడం కష్టతరంగా మారింది. ఒక్కో ఐస్ క్రీం ఫ్రీజర్ ట్రక్కులో 20 నుంచి 30 మృతదేహాలను ఉంచారు. ‘‘గాజా స్ట్రిప్ సంక్షోభంలో ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మేం చనిపోయినవారిని పాతిపెట్టలేము. శ్మశానవాటికలు ఇప్పటికే నిండిపోయాయి, చనిపోయినవారిని ఖననం చేయడానికి మాకు కొత్త శ్మశానవాటికలు కావాలి’’ అని గాజా వాసి అలీ అన్నారు.
గాజా నగరంలో కూడా అధికారులు సామూహిక సమాధులను సిద్ధం చేస్తున్నారని ప్రభుత్వ మీడియా కార్యాలయ అధిపతి సలామా మరూఫ్ తెలిపారు. అల్ షిఫా ఆసుపత్రిలో పలు మృతదేహాలు ఉన్నాయి. వంద మృతదేహాలను సామూహిక ఖననం చేసేందుకు ఒక సమాధిని సిద్ధం చేస్తున్నామని గాజా అధికారులు చెప్పారు.
