V Narayanan
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు అదనపు ప్రయోగాలకు సిద్ధమవుతోందని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. అందులో వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహం, పలు పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాలు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వం చంద్రయాన్-4 మిషన్కు అనుమతి ఇచ్చిందని వి.నారాయణన్ చెప్పారు. చంద్రుడి నుంచి నమూనాలు తీసుకురావడమే లక్ష్యంగా ఈ మిషన్ చేపడుతున్నట్లు చెప్పారు. 2028లో చంద్రయాన్-4 ఉంటుందని అన్నారు. (ISRO)
రాబోయే మూడేళ్లలో వార్షిక అంతరిక్ష నౌకల తయారీని మూడింతలు చేయాలనే లక్ష్యంతో ముందుకు ఇస్రో సాగుతోందని తెలిపారు. చంద్రయాన్-4 చంద్రుడి నుంచి నమూనాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని.. ఈ సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఉందని చెప్పారు.
Also Read: లాలూ కుటుంబంలో ఇంకా రగులుతోన్న చిచ్చు.. ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు
భారత్ 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందని తెలిపారు. అంతరిక్ష కేంద్రాన్ని నడుపుతున్న మూడవ ప్రధాన దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు. అమెరికా నేతృత్వంలోని ఐఎస్ఎస్ గడువు ముగింపు దశకు చేరుకుంది. చైనా నిర్మించుకున్న తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు జరుగుతున్నాయి.
భారత్ చేపట్టనున్న తొలి మానవ అంతరిక్ష యానం “గగనయాన్”పై వి.నారాయణన్ మాట్లాడుతూ.. 2027లో యథావిధిగా కొనసాగుతుందని, దీని షెడ్యూల్లో మార్పులేదని చెప్పారు. అన్క్రూడ్ మిషన్ టైమ్ టేబుల్లో మాత్రమే మార్పు వచ్చిందని అన్నారు. మూడు అన్క్రూడ్ పరీక్షా మిషన్లు పూర్తయ్యాకే భారతీయ వ్యోమగాములతో తొలి ప్రయాణం జరుగుతుందని చెప్పారు.