Jahangirpuri Demolition Updates : జహంగీర్పురి కూల్చివేతలపై స్టే పొడిగించింది సుప్రీంకోర్టు. రెండు వారాల పాటు కూల్చివేతాలు ఆపాలని ఆదేశించింది. స్టేటస్ కో కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపింది. అటు ఢిల్లీ మున్సిపల్ అధికారులపై మరోసారి సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా కూల్చివేతలు ఎందుకు కొనసాగించారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. నార్త్ ఢిల్లీ మేయర్ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నమని తెలిపింది. జహంగీర్పురి కూల్చివేతపై జమియత్ ఉలమా-ఐ-హింద్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా… అక్రమ కట్టడాలపై బాధితులకు గతంలో నోటీసులు జారీ చేశారా అని ధర్మాసన ప్రశ్నించింది.
Read More : Jahangirpuri violence : జహంగీర్పురి హింసాకాండలో 22మంది అరెస్ట్.. పుష్ప స్టైల్లో కోర్టుకు నిందితుడు..
నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంత గడువు తర్వాత కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించింది. ఆ నోటీసుల వివరాలు సమర్పించాలని నోటీసులు పంపింది. అలాగే ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు సైతం సుప్రీంకోర్టు వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. అటు సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూపించినా అధికారులు కూల్చివేతలు ఆపలేదని బాధితులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం.. అది నిజమని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు బుల్డోజర్ పాలిటిక్స్తో ఢిల్లీ జహంగీర్పురి నివురుగప్పిన నిప్పులా మారింది. నిన్న ఉదయం బలగాల మోహరింపుతోనే మొదలైన టెన్షన్.. ఇప్పటికీ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు వరసపెట్టి జహంగీర్పురికు వస్తుండడం హీట్ను ఒక్కసారిగా పెంచేసింది. జహంగీర్పురికి చేరిన కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, రణదీప్ సుర్జేవాలాలను పోలీసులు అడ్డుకున్నారు.