తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు (దక్షిణ) నియోజకవర్గంలో ఓటు లెక్కింపు ముగిసింది. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు.
లెక్కింపు ప్రారంభమైన మొదటి నుంచి కమల్ హాసన్ ముందంజలో ఉండగా.. సాయంత్రం 6 గంటలకు బిజెపికి చెందిన వనాతి శ్రీనివాసన్ 1000 ఓట్ల తేడాతో కమల్ను అధిగమించారు. చివరకు 1200 పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ గెలిచారు.
ఏప్రిల్ 6 న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో డీఎంకే స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. చివరి రౌండ్లలోకి వచ్చేనాటికి 156 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అధికార ఎఐఎడిఎంకే 78సీట్లతో వెనుకబడి ఉంది. 234మంది సభ్యుల తమిళనాడు అసెంబ్లీలో 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్.
ఈ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో 3,998 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. జయలలిత, కరుణానిధి ఇద్దరూ లేకుండా రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.