Kamal Nath మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండోర్లోని డీఎన్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్ పటేల్ను పరామర్శించేందుకు ఆదివారం పార్టీ నేతలు సజ్జన్ వర్మ, జితు పట్వారీ, ఎమ్మెల్యే విశాల్ పటేల్, నగర కాంగ్రెస్ చీఫ్ వివేక్ బక్లివాల్తో కలిసి కమల్నాథ్ ఆ ఆసుపత్రికి వెళ్లారు.
అయితే వారంతా ఆసుపత్రి లిఫ్ట్ ఎక్కగా పెద్ద శబ్దంతో పది అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు జారింది. అనంతరం లిఫ్ట్ డోర్ మూసుకుపోయింది. లాక్ అయిన లిఫ్ట్ తలుపులు లాక్ అయిపోవడంతో … కమల్నాథ్తో సహా మిగతా కాంగ్రెస్ నేతలు 15 నిమిషాల పాటు అందులో ఉండిపోయారు. చివరకు టెక్నీషియన్లను రప్పించి లిఫ్ట్ డోర్ను తెరిపించారు.
ఈ ఘటన అనంతరం కమల్నాథ్ ట్వీట్ చేశారు. హనుమంతుడి కృప వల్ల ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కమల్నాథ్కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఇండోర్ కలెక్టర్ మనీశ్ సింగ్ను ఆదేశించారు.