కన్వర్ యాత్ర చుట్టూ కాంట్రవర్సీలు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేమ్ బోర్డు ఇష్యూ

కన్వర్ యాత్ర నేపథ్యంలో యూపీ సర్కార్ ఇచ్చిన నేమ్ బోర్డ్ ఆర్డర్స్ ఇష్యూగా మారి ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. మరోవైపు యూపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది అపోజిషన్.

Kanwar Yatra 2024 Nameplate diktat paused by Supreme Court

Kanwar Yatra 2024 : కన్వర్ యాత్ర. ఇది మతపరమైన విశ్వాసం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర. ఏటా 15రోజుల పాటు జరిగే కన్వర్ యాత్రకు యూపీలోని పలు ప్రాంతాల నుంచి కావడి మోస్తూ హరిద్వార్‌కు వెళ్లి వస్తుంటారు భక్తులు. నమ్మకాలు, విశ్వాసం మధ్య నడిచే ఈ యాత్ర చుట్టూ కాంట్రవర్సీ దుప్పటి కప్పుకుంది. ఏటా సాఫీగా సాగే కన్వర్ యాత్ర రూట్‌లో ఏర్పాటు చేసే హోటళ్లపై గత ఏడాది నుంచి వివాదం మొదలైంది. ఈ ఏడాది అయితే ఏకంగా పోలీసులే అధికారికంగా ప్రకటించేశారు. హోటళ్లు, దాబాల బోర్డులపై యజమానుల పేర్లు రాయాల్సిందేనంటూ ముజఫర్‌నగర్ పోలీసులు ఇచ్చిన ఆర్డర్స్ రచ్చకు దారితీశాయి. ఇష్యూ అధికార పార్టీ వర్సెస్ అపోజిషన్‌గా మార్చేసింది.

యజమానుల పేరుతో నేమ్‌బోర్డులు ఉండాల్సిందే
అసలే శ్రావణం. హిందువులు అత్యంత నియమనిష్టలతో ఉండే నెల. ఈ సమయంలో జరిగే కన్వర్ యాత్ర పరమపవిత్రంగా భావిస్తుంటారు భక్తులు. ఫక్తు శాఖాహారం మాత్రమే తిని కన్వర్ యాత్ర చేస్తుంటారు. అయితే యాత్ర జరిగే మార్గాల్లో ముస్లింలు నిర్వహించే హోటల్స్, దాబాలు కూడా ఉంటాయి. అందులో శాఖాహారం ఉంటుందా మాంసాహారం ఉంటుందా అనేది తెలియదు. హోటల్ నేమ్‌బోర్డులపై యజమాని పేరు రాస్తే భక్తులకు క్లారిటీ వస్తుందనేది యూపీ ప్రభుత్వం వాదన. దాంతో కన్వర్‌ యాత్ర రూట్‌లో హోటళ్లకు యజమానుల పేరుతో నేమ్‌బోర్డులు ఉండాల్సిందేనని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

బలవంతంగా షాపులకు నేమ్ బోర్డులు
కన్వర్‌ యాత్రకు వెళ్తున్నవారికి శాఖాహారం ఎక్కడ దొరుకుతుందో తెలిసేందుకే ఈ నిబంధన పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ సీఎంవో ప్రకటించింది. అయితే ముజఫర్‌నగర్ పోలీసులు ఇచ్చిన ఆర్డర్స్‌పై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. నేమ్ బోర్డులపై యజమానుల పేర్లు రాయడంతో పాటు నాన్ వెజ్ దాబాలు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశాలిచ్చినట్లు ఆరోపిస్తున్నారు ముస్లింలు. బలవంతంగా షాపులకు నేమ్ బోర్డులు కొట్టిస్తున్నారని చెబుతున్నారు. అయితే తాము ఎవరినీ నేమ్ బోర్డు మార్చుమని చెప్పడం లేదని.. బలవంతంగా ఆదేశాలు కూడా ఇవ్వలేదని.. హోటల్ యజమానులే స్వచ్చందంగా హోటళ్లపై ఓనర్ పేర్లు రాస్తున్నారని చెప్పుకొస్తున్నారు పోలీసులు.

యూపీ ప్రభుత్వ నిర్ణయానికి VHP మద్దతు
అటు ముస్లింలు, ఇటు పోలీసుల వాదనలు ఇలా ఉంటే.. హిందూ సంఘాల వాదన మాత్రం క్లియర్ కట్‌గా ఉంది. బీజేపీ, VHP మాత్రం యూపీ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాయి. ఉపవాస దీక్షలో ఉండేవారికి వెజ్ భోజనం మాత్రమే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునేందుకు పోలీసులు ఇచ్చిన ఆర్డర్స్ ఉపయోగపడుతాయని అంటున్నారు. యజమానులు, కార్మికుల పేర్లు, ఫోన్‌ నంబర్లను ఫుడ్ స్టాల్స్పై రాసినంత మాత్రాన లౌకిక వాదానికి ఎలాంటి భంగం జరగదని కౌంటర్ ఇస్తున్నారు. నేమ్ బోర్డులు పెట్టడానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు బాబా రాందేవ్.

సోనూ సూద్ ట్వీట్.. కంగనా రనౌత్ కౌంటర్
యూపీ సర్కార్ ఇచ్చిన నేమ్ బోర్డ్ ఆర్డర్స్ ఇష్యూగా మారి ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. మరోవైపు యూపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది అపోజిషన్. భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్‌ విరుచుకుపడింది. యూపీలో ముస్లింలను సెకండ్ గ్రేడ్ పీపుల్స్‌గా చూస్తున్నారని అసదుద్దీన్ విమర్శించారు. పొలిటికల్ వారే కాదు.. సినీ స్టార్లు కూడా కన్వర్ యాత్ర కాంట్రవర్సీపై స్పందిస్తున్నారు. కన్వర్ యాత్ర రూట్ల్‌లోని దుకాణాల నేమ్ బోర్డులపై మానవత్వం మాత్రమే ప్రదర్శించాలని నటుడు సోనూసూద్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కంగనా రనౌత్.. పూర్తిగా అంగీకరిస్తున్నానంటూనే.. హలాల్ స్థానంలో కూడా మానవత్వం అని రాయాలని కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు.

Also Read: నాన్నా నేను సాధించా.. ఆనందంతో తండ్రిని హత్తుకున్న కూతురు.. ఇన్‌స్పైరింగ్ స్టోరీ

హోటల్స్, దాబాల విషయంలోనూ వివాదం
ప్రతీ ఏటా శ్రావణ మాసంలో లక్షలాది కావడి యాత్రికులు హరిద్వార్ వెళ్లి అక్కడ గంగా నది నుంచి నీటిని తీసుకొని తిరిగొస్తారు. ఆ క్రమంలో ముజఫర్‌నగర్ మీదుగా కాలి నడకన వెళ్తారు. ఈ దారిలో కొన్ని దుకాణాలకు ఇప్పటికే యజమానుల పేర్లు రాసి ఉన్నాయి. అయితే వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటికే హోటళ్లలో పనిచేసే ముస్లిం కార్మికులు పనికి రావడం లేదని అంటున్నారు ఓనర్లు. సేమ్‌టైమ్ హిందూ, ముస్లింలు కలసి నిర్వహిస్తున్న హోటల్స్, దాబాల విషయంలోనూ వివాదం నడుస్తూనే ఉంది. ఇద్దరి పేర్లు పెడితే హిందూ యజమాని కూడా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. నేమ్ బోర్డు ఇష్యూను అందరూ సీరియస్‌గానే తీసుకుంటున్నారు. అటు ప్రభుత్వం నేమ్ బోర్డులు ఉండాల్సిందే అంటుంటే.. ముస్లింల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాఖాహారమే పెట్టి.. ఎలాంటి కల్తీ లేకపోతే నేమ్ బోర్డులు పెట్టడానికి వచ్చిన సమస్య ఏంటని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Also Read: యూపీ సీఎం యోగిని ఇరకాటంలో పెట్టాలని బీజేపీ అగ్రనేతల వ్యూహం?

మరోవైపు ఇప్పటికే కన్వర్ యాత్ర ప్రారంభమైంది. కావడి ఎక్కువ దూరం మోయాల్సిన వారు, భారీ కావళ్లు మోసే యాత్రికులు నాలుగైదు రోజుల ముందుగానే నడక మొదలుపెట్టారు. కుటుంబంలో శాంతి, సంతోషం కోసం ఈ బరువైన కావడి మోస్తామని చెప్తున్నారు భక్తులు. అయితే షాప్ హిందువుదా, ముస్లిందా అనేది తమకు ముఖ్యం కాదంటున్నారు భక్తులు.

ట్రెండింగ్ వార్తలు