Karnataka: వాహనదారులపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఓలా, ఊబర్, రాపిడో ఆటోలపై కర్ణాటక రవాణా శాఖ వేటు వేసింది. ఇవి చట్టవిరుద్ధమని, ఇక నుంచి ఓలా, ఊబర్, రాపిడో ఆటోలు ప్రయాణించవద్దంటూ అక్టోబర్ 6న ఆదేశాలు జారీ చేశారు. రెండు కిలోమీటర్లకు 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిపై వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ పేర్కొంది.
ఈ విషయమై రవాణా శాఖ కమిషనర్ టీహెచ్ఎం కుమార్ స్పందిస్తూ ‘‘ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగేటర్లు తమ ఆటో రిక్షా సేవలను నిర్వహిస్తున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారని డిపార్ట్మెంట్ తెలుసుకున్నది. వీలైనంత త్వరగా ఆటో సేవలను నిలిపివేయాలని, వాహనదారుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ వసూలు చేయడాన్ని నిలిపివేయాలని వారికి నోటీసులు పంపాము. అంతేకాకుండా, డిపార్ట్మెంట్ ఆర్డర్ను బేఖాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాము’’ అని అన్నారు.