Kerala Lockdown : కేరళలో జూన్ 9వరకు లాక్ డౌన్ పొడిగిస్తు సీఎం పినరయ్ విజయన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ లాక్ డౌన్ తొలగించే దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. మే31 నుంచి జూన్ 9వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మే 8వ తేదీనుంచి కేరళలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. గతంలో మే 16న, మే23న లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేసులు ఎక్కువగా ఉన్న మల్లప్పురం జిల్లాలో ట్రిపుల్ లాక్డౌన్ను అమలు చేయగా… ప్రస్తుతం అక్కడ సాధారణ లాక్డౌన్ కొనసాగుతుందన్నారు.
ఇతర జిల్లాలతో పాటు గత మూడు రోజుల్లో రాష్ట్రంలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు (టీపీఆర్) తిరువనంతపురంలో 20.21శాతం, పాలక్కాడ్లో 23.86 శాతంగా ఉందని.. మిగతా జిల్లాలో 20 శాతానికంటే తక్కుగానే ఉందని విజయన్ తెలిపారు. మలప్పురం జిల్లాలో టీపీఆర్ ఈ నెల 23న 31.53 శాతం ఉండగా.. ప్రస్తుతం 17.25 శాతానికి తగ్గింది. ఈ సందర్భంగా కొన్ని మినహాయింపులు ప్రకటించారు.
పారిశ్రామిక సంస్థలు ఉద్యోగుల్లో 50 శాతం మించకుండా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. పారిశ్రామిక సంస్థలకు సరఫరా చేసే దుకాణాలు మంగళవారం, గురు, శనివారాల్లో సాయంత్రం 5 గంటల వరకు.. సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. పుస్తకాలు, బట్టల, ఆభరణాలు, చెప్పుల దుకాణాలు సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు తెరచుకోవచ్చని, కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. జూన్ మొదటి వారంలో మరింత వ్యాక్సిన్ స్టాక్ అందుబాటులోకి వస్తుందని, లభ్యత మేరకు టీకా డ్రైవ్ను వేగవంతం చేస్తామని సీఎం చెప్పారు.