Kerala Lockdown Extended : కేరళలో మే-30వరకు లాక్ డౌన్ పొడిగింపు
కేరళలో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొత్త కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో పిన్నరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది
- venkaiahnaidu
- Updated on- May 21, 2021 / 09:17 PM IST
Kerala Lockdown Extended
Kerala Lockdown కేరళలో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొత్త కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో పిన్నరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి కేరళలో విధించిన లాక్డౌన్ ను ఈనెల 30 వరకూ పొడిగిస్తున్నట్టు సీఎం పినరయి విజయన్ శుక్రవారం ప్రకటించారు. ఇక,తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిసూర్ జిల్లాల్లో పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో విధించిన ట్రిపుల్ లాక్ డౌన్ ను శనివారం నుంచి ఉపసంహరించనున్నట్లు సీఎం తెలిపారు. అయితే, మలప్పురం జిల్లాలో ట్రిపుల్ లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు.
కాగా, కేరళలో శుక్రవారం… 29,676కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా,41,032మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు,142మంది కరోనాతో కన్నుమూశారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6994మంది కోవిడ్ తో చనిపోయారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,79,919మంది కరోనా నుంచి కోలుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,06,346 యాక్టివ్ కోవిడ్ కేసులున్నట్లు తెలిపారు. గడిచిన 24గంటల్లో 1,33,558మందికి టెస్టులు చేసినట్లు తెలిపారు.
అయితే,వీకెండ్ ఆంక్షలు మరియు లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించినప్పటికీ రోజువారీ కోవిడ్ కేసులు తగ్గకపోవడంతో మే-8న కేరళ ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించింది. మే-16న లాక్ డౌన్ ను మే-22వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా లాక్ డౌన్ ను మే-30వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
