జీఎస్టీ గుడ్ న్యూస్.. స్లాబులు మారబోతున్నాయ్.. వీటి ధరలు తగ్గబోతున్నాయ్..

ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌ (GST Slabs) లను ఇకపై రెండు జీఎస్టీ స్లాబ్‌లకు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తుంది.

జీఎస్టీ గుడ్ న్యూస్.. స్లాబులు మారబోతున్నాయ్.. వీటి ధరలు తగ్గబోతున్నాయ్..

GST Slabs

Updated On : August 16, 2025 / 10:29 AM IST

GST Slabs: పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు, చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారిపై పన్ను భారాన్ని తగ్గించేందుకు దృష్టిసారించింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల తరువాత జీఎస్టీ (GST Slabs) విధానానికి కీలక సవరణలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

Also Read: అలాస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం.. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిన భేటీ.. ఇద్దరు నేతలు కీలక కామెంట్స్.. భారత్‌పై సుంకాల గురించి..

ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు స్లాబ్‌లు.. ఇకపై రెండు స్లాబ్‌లకు జీఎస్టీ (GST Slabs)ని పరిమితం చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం చకచకా పనులు జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని మోదీ సర్కార్ ఆలోచన చేస్తోంది.

ప్రస్తుతం జీఎస్టీలో 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం స్లాబ్‌లు ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం.. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్‌ల స్థానంలో 5శాతం, 18శాతం అనే రెండు స్లాబ్‌లు మాత్రమే కొనసాగనున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉపయోగించే వస్తువుల్లో 99శాతం (ప్రస్తుతం 12శాతం స్లాబ్‌లో ఉన్నవి) 5శాతం స్లాబ్‌లోకి మారనున్నాయి.

అలాగే 28శాతం స్లాబ్‌లో ఉన్న 90శాతం వస్తువులు 18శాతం స్లాబ్ లోకి వస్తాయి. కొన్ని ప్రత్యేక వస్తువులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనుంది. కానీ, కచ్చితమైన తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం తరువాత ఈ ప్రతిపాదన వచ్చింది. దీపావళి నాటికి జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు వస్తాయని, సామాన్య ప్రజలకు గణనీయమైన పన్ను ఉపశమనం కలుగుతుందని, చిన్న వ్యాపారులకు లాభం చేకూరుతుందని చెప్పారు.

ప్రభుత్వం జీఎస్టీ రేట్ల సరళీకరణ, సంస్కరణలపై తన ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి పంపింది. ప్రస్తుతం 12శాతం స్లాబ్‌లో 99శాతం వస్తువులు 5శాతం స్లాబులోకి రానున్నాయి. 28శాతం పన్ను స్లాబులో ఉన్న 90శాతం వస్తువులు 18శాతానికి మారుతాయా అనేది వేచి చూడాల్సిందే.

అన్నివర్గాల ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులు, మహిళలు, విద్యార్థులు, మధ్య తరగతి, రైతులకు లాభం కలిగించేలా పన్ను రేట్లను సులభం చేయనున్నారు. సవరించిన జీఎస్టీ విధానంలో జౌళి, ఎరువులు, ఫునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటీవ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూర్చనుంది.

ఈ సవరణ వినిమయానికి ఊతమందిస్తుందని, పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కొత్త జీఎస్టీ విధానంలో హానికారక వస్తువులపై 40శాతం ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ శ్రేణి పొగాకుతో సహా కేవలం ఏడు వస్తువులు, సేవలకు మాత్రమే వర్తిస్తుంది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రక్రియను హానికారక సేవల శ్రేణిలో చేర్చే అవకాశం ఉంది.

Also Read: India : నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌