కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వ బిల్లుని నిరసిస్తూ ఓ ఐపీఎస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి పౌరసత్వ బిల్లు విరద్ధం అంటూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయనే మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ అబ్దుర్ రహమాన్.
ముంబై(రాష్ట్ర మానవ హక్కుల కమిషన్)లో స్పెషల్ ఐజీపీగా రహమాన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ‘రాజ్యాంగ ప్రాథమిక లక్షణానికి పౌరసత్వ సవరణ బిల్లు 2019 పూర్తి వ్యతిరేకంగా ఉంది. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగించేదిగా ఉన్న ఈ బిల్లును ఖండిస్తున్నా. నా సర్వీసును వదిలేస్తున్నా. రేపటి నుంచి విధులకు హాజరుకాను’ అంటూ ట్విటర్లో తన రాజీనామా లేఖను పోస్ట్ చేశారు.
బుధవారం(డిసెంబర్ 12,2019) రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందినట్టు అయ్యింది. దీన్ని నిరసిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా చేశారు. ఐపీఎస్ సర్వీసుల నుంచి వైదొలిగారు. పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభ ఆమోదముద్ర వేసిన నిమిషాల వ్యవధిలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. భారత లౌకికవాద భావనకు విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని రహమాన్ కోరారు.
పౌరసత్వ (సవరణ) బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పెద్దల సభలో జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు CAB.
కాగా పౌరసత్వ బిల్లుని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింల హక్కులకు విఘాతం కలుగుతుందని వాపోతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ వచ్చిన భారత మూల సిద్ధాంతాలకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుందని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. విభజించి పాలించు అనే విధానానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసినట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డాయి.