vote chori : రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలకు బీజేపీ కౌంటర్
vote chori : హరియాణాలో భారీఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi
vote chori : హరియాణాలో భారీఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాహుల్ గాంధీ చేసిన ‘ ఓటు చోరీ’ వ్యాఖ్యలు నిరాధారమైనవి మాత్రమే కాదు.. భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రయత్నం కూడా అని బీజేపీ పేర్కొంది. రాహుల్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ ప్రకటన విడులైంది.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఒక వృద్ధ మహిళ పేరు ఓటర్ల జాబితాలో 200 సార్లు ఉందని అన్నారు. కానీ, ఆయన చూపించిన జాబితా మూలానా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఈ ఒక్క నిజం రాహుల్ గాంధీ ఆరోపణలను అబద్ధమని స్పష్టంగా చూపిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది.
రాహుల్ గాంధీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ, ఇదే వ్యక్తి 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ను “మోసపూరితమైనవి” అని తానే ఖండించారు. 2024లో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి, చివరకు అదే నిజమైంది. బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.
హర్యానా ఎన్నికలు పూర్తి పారదర్శకతతో జరిగాయి. 2024లో ఎన్నికల సంఘం ఆగస్టు 2న ప్రాథమిక జాబితా విడుదల చేసింది, 4.16 లక్షల క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిశీలించి ఆగస్టు 27న తుది జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు ఒక్క అభ్యంతరమూ లేవనెత్తలేదు. సెప్టెంబర్ 16న ఈ తుది జాబితాను అన్ని అభ్యర్థులకు మళ్లీ అందజేశారు. 20,000 పోలింగ్ కేంద్రాల్లో 87,000 ఏజెంట్లు పర్యవేక్షణ చేశారు. లెక్కింపులో కేవలం 5 ఫిర్యాదులు మాత్రమే అందాయి వాటిలో ఏదీ కాంగ్రెస్ నుంచి కాదు.
అయితే, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో బ్రెజిలియన్ మోడల్ ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ ఆరోపించారు. కానీ, మీడియా బృందం ఆ EPIC నంబర్ ను చెక్ చేయగా.. అది నిజమైన ఓటర్ కే చెందినదని తేలింది. రాహుల్ బృందం చూపించిన ఫొటో మాత్రం మార్ఫ్ చేయబడిన నకిలీ చిత్రం. ఇదిలాఉంటే.. రాహుల్ మీడియాలో సమావేశంలో చూపిన ఫొటోలోని మోడల్ పేరు లారిసా. అయితే, రాహుల్ ఆరోపణలపై ఆమెసైతం తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. తన పేరు రావడంచూసి చాలా షాకయ్యానని తెలిపారు. చాలామంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇంటర్వ్యూలు అడుగుతున్నారని తెలిపారు. ఇలా వైరల్ అవుతానని అనుకోలేదన్నారు.
రాఫెల్ కుంభకోణం, చౌకీదార్ చోర్ హై, కుల కార్డు రాజకీయాలు వంటి విఫలమైన ప్రచారాల తర్వాత.. రాహుల్ గాంధీ ఇప్పుడు యువతను తన రాజకీయ పోరాటంలో సాధనాలుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. కానీ నేటి న్యూ ఇండియాలోని యువత ఈ ప్రతికూల, విభజన, దిశానిర్దేశం లేని రాజకీయాలను తిరస్కరిస్తున్నారు. భారతదేశ యువత పనితీరు, పురోగతి, దేశభక్తిని నమ్ముతుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గమనించాలని సూచించారు.
