Maharashtra political crisis: దేశరాజకీయాల్లోనే కురువృద్ధుడు… మహారాష్ట్ర రాజకీయాలకు భీష్మపితామహుడు శరద్ పవార్. ముఖ్యమంత్రి పీఠాన్ని ఉద్ధవ్ ఠాక్రేకు ఇచ్చి.. రిమోట్ కంట్రోల్ తన చేతుల్లో పెట్టుకున్నారన్న టాక్ మహారాష్ట్రలో ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది. మహారాష్ట్రకు 3సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాజకీయ భీష్మాచార్యుడు ఏక్నాథ్ షిండే ఇచ్చిన షాక్తో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన హవా తగ్గకుండా చూసుకునే శరద్ పవార్.. ఇప్పుడేం చేస్తారన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్..
శరద్ పవార్… మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హయాం నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ హయాం వరకు పలు మార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మహారాష్ట్రకు 3సార్లు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకొని 1999లో ఎన్సీపీ ఏర్పాటు చేసి మళ్లీ మహారాష్ట్రలో తిరుగులేదని నిరూపించుకున్నారు. మహారాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా పవార్ మాత్రం తన పవర్ చూపిస్తూనే ఉన్నారు.
1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శరద్ పవార్ అప్పటి నుంచి ఐదు దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యత్వం, మంత్రిపదవి, ముఖ్యమంత్రి పదవి ఇలా పొలిటికల్ కెరీర్లో అన్ని నిచ్చెనలు ఎక్కారు. అయినా ఇప్పటికి ఎన్సీపీని మహారాష్ట్రలో నెంబర్ వన్గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలో శివసేనకు, కాంగ్రెస్కు మధ్య వారధిగా నిలబడి ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చేశారు. స్వయంగా తానే కూటమికి ఛైర్పర్సన్గా ఉంటూ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగేలా ప్రయత్నం చేశారు. కానీ ఆయన వ్యూహం తొలిసారి బెడిసికొట్టినట్టుగా కనిపిస్తోంది.
సంజయ్రౌత్ను పావుగా చేసుకుని శివసేనను నాశనం చేసే పనిలో పవార్ ఉన్నారంటూ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పైగా ఉద్ధవ్ భుజాలపై తుపాకీ పెట్టి పవార్ కాల్చుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఓ రకంగా ముఖ్యమంత్రి పదవి ఎన్సీపీ చేతుల్లో లేకపోయినా.. మహారాష్ట్రలో అంతా నడిపిస్తోందని పవారే అంటారు. అయితే.. ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకే ఎదురొడ్డి పోరాడిన ఈ మరాఠా యోధుడు .. షిండే ఆడిన చదరంగంలో ఎటు వెళ్లాలో తెలియక క్రాస్ రోడ్డులో వేచి చూస్తున్నారు.
ఇంతకాలం దేశ రాజకీయాలను మహారాష్ట్ర నుంచే శాసించిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అనూహ్యంగా వచ్చిన సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బీసీసీఐకి కూడా అధ్యక్షుడిగా చేసిన పవార్ మ్యాచ్లో చివరి బంతి వరకు ఆట ఎప్పుడైనా టర్న్ కావొచ్చనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కానీ అటు బీజేపీ మాత్రం వేగంగా పావులు కదుపుతోంది. చివరి బంతి వరకు ఆట రాకుండా మధ్యలోనే రనౌట్ చేసే పనిలో ఉంది. ఏక్నాథ్ షిండేను పావులా వాడుకుంటోంది. మరి ఈసారి ఈ భీష్మపితామహుడు మాట చెల్లుతుందా లేదంటే ఇక కాలం చెల్లినట్టేనా అనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది.
Maharashtra political crisis: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఏకనాథ్ షిండే అడుగులు..పేరు కూడా ఖరారు?!