జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి. కథువా ప్రాంతంలోని దివాల్ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు పదార్దాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భద్రతా దళాలు సోమవారం(సెప్టెంబర్ 23,2019) భగ్నం చేశాయి. కథువా ప్రాంతంలోని దివాల్ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు పదార్దాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు భద్రతా దళాలు వెల్లడించాయి.
దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. నిఘావర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారంతో ఆర్మీ ఇంటెలిజెన్స్ దళాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు జరపగా.. అనుమానిత ప్రాంతంలో దేశీయంగా తయారు చేసిన పేలుడు పదార్ధాలు లభించాయి. మరోవైపు బాలాకోట్లో ఉగ్ర శిబిరాలు తిరిగి చురుకుగా మారాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దు ద్వారా 500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని బిపిన్ రావత్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్లో ఉగ్రదాడులు చేసేందుకు పాకిస్తాన్ పలు ప్రయత్నాలు సాగిస్తోందని, దేశంలోకి ఉగ్రవాదులను పంపించటంతో పాటు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు తెగబడుతోందని వెల్లడించారు.