CJI NV Ramana : మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసహనం..డిబేట్లతో జడ్జీలు కూడా ఇవ్వలేని తీర్పులిచ్చేస్తోంది అంటూ విమర్శలు

మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏదోక ఎంజెండా పెట్టుకుని డిబేట్లు పెట్టి అనుభవం ఉన్న న్యాయమూర్తులు కూడా ఇవ్వలేని తీర్పులిచ్చేస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్వీ రమణ.

CJI NV Ramana comments on media : మీడియా సంస్థలపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల కూడా ఇవ్వలేని తీర్పుల్ని మీడియా సంస్థలు ఇచ్చేస్తున్నాయి అంటూ చురకలు వేస్తూ విమర్శలు కురిపించారు ఎన్వీ రమణ. అర్థం పర్థం లేని ఎజెండాలతో ఇష్టానురీతిగా డిబేట్లు పెట్టేసుకుని వారే న్యాయనిర్ణేతలుగా మారిపోతున్నాయి మీడియా సంస్థలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశఆరు. ఆయా మీడియా సంస్థలు తమ డిబేట్లలో కంగారు కోర్టులు (సరైన ఆధారాలు లేని అనధికార కోర్టులు)గా వ్యవహరిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఇంకా దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. అవగాహన లేమితో కూడిన సమాచారం, పక్షపాతం, ఒక అజెండా ఆధారంగా వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని అన్నారు. జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

ఇటువంటి ఎజెండాలతో నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి ఎటువంటి మేలు చేయవు అని స్పష్టం చేశారు. ఇష్టానురీతిగా ఏదోక అంశంపై గంటల తరబడి చర్చలు పెడుతూ వాస్తవాలు..అవాస్తవాల మధ్య తేడాను మీడియా గుర్తించటంలేదు అంటూ చీవాట్లు పెట్టారు ఎన్వీ రమణ. ఇటువంటి చర్యలు ప్రజలకు హాని చేస్తాయి తప్ప ఎటువంటి ఉపయోగం ఉండవని..ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తాయన్నారు. ఇలా మీడియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంపై తీవ్రంగా మండి పడ్డారు సీజేఐ ఎన్వీ రమణ. ఇటువంటి డిబేట్లు సమాజానికి ప్రమాదకరం అని అన్నారు.

మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ… ఏది మంచో, ఏది చెడో నిర్ధారించలేకపోతున్నాయని అన్నారు. ఈ పరిణామాలతో ఎంతో అనుభవం ఉన్న న్యాయమూర్తులకు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోందని చెప్పారు. అవగాహన లేకుండా లేదా ఒక స్వార్థపూరితమైన అజెండాతో వ్యాపింపజేసే అభప్రాయాలు ప్రజస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని అన్నారు.

బాధ్యతను అతిక్రమించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మీడియా రెండడుగులు వెనక్కి తీసుకెళ్తోందని అన్నారు. కొంత స్థాయి వరకు ప్రింట్ మీడియా బాధ్యతతో వ్యవహరిస్తోందని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు ఏమాత్రం జవాబుదారీతనం లేదని విమర్శించారు. సోషల్ మీడియా అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, కానీ విధి తనకు మరో దారి చూపించిందని చెప్పారు. న్యాయమూర్తి అయినందుకు తాను బాధపడటం లేదని అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు