Vaishno Devi shrine : కొత్త సంవత్సరం రోజున తెల్లవారుజామున 2:30గంటల సమయంలో జమ్ముకశ్మీర్లోని కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాటకు గల కారణాన్ని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఘటనా సమయంలో కొందరు యువకుల మధ్య చిన్న ఘర్షణ జరిగిందని..ఆ గొడవ కారణంగానే వైష్ణో దేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగిందని దిల్బాగ్ సింగ్ తెలిపారు. పోలీసులు, అధికారులు వెంటనే రంగలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపారు. దురదృష్టవశాత్తు 12 మంది మరణించారని తెలిపారు. గాయపడిన దాదాపు 15 మందిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. డీజీపీ దిల్బాగ్ సింగ్.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భక్తుల సంఖ్యను పరిమితం చేసే విషయంపై చర్చించినట్లు వెల్లడించారు.
కాగా,ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించారు ప్రధాని.
తొక్కిసలాట ఘటన అనంతరం వైష్ణో దేవీ యాత్ర సజావుగానే సాగుతున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. యాత్రికులు దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు
ALSO READ Vijayasai Reddy : జిన్నా టవర్ పేరు మార్పు కోరే బదులు ప్రత్యేక హోదా అడగండి