MP Manish Tewari introduces bill to monitor internal polls of political parties
Congress Bill: ఎన్నికల రంగంలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఎంతలా ఉన్నా.. రాజకీయ పార్టీల అంతర్గత ప్రయోజనాల విషయంలో ఐక్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. ఒకసారి పార్లమెంట్లో స్మోకింగ్ హాల్ తీసేసే అంశంలో వాళ్లు చూపించిన ఐక్యతే అందుకు నిదర్శనం. పార్టీలకు అతీతంగా అందరూ ఏకమైన ఆ హాలును కాపాడుకున్నారు. ఇక అంతర్గ ప్రయోజనాల విషయంలో ఆ ఐక్యత ఏ రేంజులో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు.
అలాంటిది, కాంగ్రెస్ పార్టీ ఇందుకు భిన్నంగా వ్యవహరించి లోక్సభలో సంచలన బిల్లు ప్రవేశపెట్టింది. ఆ పార్టీ నేత, ఎంపీ మనీశ్ తివారీ శనివారం ప్రవేశ పెట్టిన ఈ బిల్లు ప్రకారం.. దేశంలోని అన్ని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అంతర్గత పనితీరును క్రమబద్ధీకరించి, పర్యవేక్షించే సామర్థ్యాన్ని భారత ఎన్నికల కమిషన్కు కల్పించాలి. పార్టీల పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నియమ, నిబంధనల ఆధారంగా ఉండేలా చూడాలని బిల్లు ప్రవేశ పెట్టే సందర్భంలో తివారీ పేర్కొన్నారు.
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. బీజేపీని ఏమాత్రం ఢీకొట్టలేక ఎనిమిదేళ్లుగా చతికిల పడిపోతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి బిల్లు రావడం గమనార్హం. ఇక ఈ బిల్లు గురించి మనీశ్ తివారీ మాట్లాడుతూ ‘‘భారత దేశ ప్రజాస్వామిక నమూనా పనితీరులో అత్యంత తీవ్రమైన దౌర్బల్యం ఉంది. రాజకీయ పార్టీల కార్యకలాపాలు మన ప్రజాస్వామ్య సౌధానికి బలమైన పునాది వంటివి. ఈ రాజకీయ పార్టీల నిర్మాణాలు, అంతర్గత పని తీరు అత్యంత గోప్యంగా ఉంటోంది. పారదర్శకత లేకుండా పోయింది. వీటి కార్యకలాపాలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నియమానుసారంగా జరిగేలా చూడవలసిన అవసరం ఉంది’’ అని అన్నారు.
‘రాజ్యాంగ సవరణ చట్టం-2022’ అని పేర్కొంటూ ప్రవేశపెట్టిన ఈ బిల్లు భారత దేశానికి అవసరమైన ప్రజాస్వామిక సంస్కరణల రెండో ప్రభంజనమని తివారీ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల అంతర్గత పనితీరుకు సంబంధించిన ఆదేశాలు, సూచనల అమలులో విఫలమవుతున్న సందర్భాల్లో, సంబంధిత రాజకీయ పార్టీ జాతీయ లేదా రాష్ట్ర గుర్తింపును రద్దు చేసేందుకు ఈసీఐకి అధికారం కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అదే విధంగా ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్, కేటాయింపు క్రమం) 1968లోని సెక్షన్ 16-ఏ ప్రకారం తగిన చర్య తీసుకోవడానికి అధికారం కల్పించాలని ఆయన ప్రతిపాదించారు.
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకంపై లోక్సభలో జరిగిన వాగ్వాదంపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య శాంతియుత సంబంధాలు ఉండాలని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థకు నియామకాలపై వచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించిన అంశాలపై చర్చించాలని కోరుతూ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసును ఇచ్చారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రత, స్వయంప్రతిపత్తిపై ఆందోళన పెరుగుతోందని ఈ నూతన బిల్లులో తివారీ పేర్కొన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామకాలను ఒక ప్యానెల్ ద్వారా నిర్వహించాలని ప్రతిపాదించారు.
దేశ ప్రధాన మంత్రి సహా కేంద్ర హోం మంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఫ్లోర్ లీడర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఈ కమిటీలో ఉండాలని సూచించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్లకు నిర్ణీత పదవీ కాలం ఆరు సంవత్సరాలు ఉండాలని, రీజనల్ కమిషనర్ల పదవీ కాలం మూడు సంవత్సరాలు ఉండాలన్నారు. ఈ పదవులను నిర్వహించినవారు పదవీ కాలం పూర్తయిన తర్వాత ఏదైనా ప్రభుత్వ లేదా జ్యుడిషియల్ పదవులలో నియమితులయ్యే అర్హత లేకుండా చేయాలని నూతన బిల్లులో మనీశ్ తివారీ తెలిపారు.
AAP vs Congress: బీజేపీకి లాభం చేకూర్చేలా ఎన్నికల పోటీ.. ఆప్ తీరుపై కాంగ్రెస్ గరంగరం