Rahul Gandhi : పాకిస్తాన్ బోర్డర్ లా పార్లమెంట్.. ఇది ప్రజాస్వామ్య హత్యే.. విపక్షాల నిరసన ప్రదర్శన
పెగాసస్ హ్యాకింగ్,వ్యవసాయ చట్టాలు,రాజ్యసభలో విపక్ష ఎంపీలపై దాడి సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం విపక్ష నేతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
- venkaiahnaidu
- Published On : August 12, 2021 / 03:18 PM IST
Rahul
Rahul Gandhi పెగాసస్ హ్యాకింగ్,వ్యవసాయ చట్టాలు,రాజ్యసభలో విపక్ష ఎంపీలపై దాడి సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం విపక్ష నేతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు జరిగిన విపక్ష నేతల నిరసన ర్యాలీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలతో హోరెత్తించారు విపక్ష నేతలు. విజయ్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..దేశంలో విపక్షాల గొంతునొక్కుతున్న మోదీ సర్కార్ అణిచివేత వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తోందనియ విమర్శించారు. రాజ్యసభలో బుధవారం ఎంపీల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. దేశాన్ని తెగనమ్ముతున్న మోదీ ప్రభుత్వంపై గొంతెత్తిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయని,వాస్తవానికి దేశంలోని 60 శాతం ప్రజలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగలేదనే అనుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని 60 శాతం మంది గళాన్ని మోదీ సర్కార్ అణచివేసిందన్నారు. ఇది ప్రజాస్వామ్య హత్య అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పార్లమెంట్ లో తమను మాట్లాడనివ్వలేదు కాబట్టే తాము బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నట్లు రాహుల్ తెలిపారు.
మరోవైపు, పార్లమెంట్లో విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేని పరిస్ధితి నెలకొందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బుధవారం మహిళా ఎంపీల పట్ల దురుసుగా వ్యవహరించిన ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చని వ్యాఖ్యానించారు. తనకు పార్లమెంట్ లో ఉన్నప్పుడు.. పాకిస్తాన్ బోర్డర్లో నిల్చున్న అనుభూతి కలిగిందని సంజయ్ రౌత్ అన్నారు. కాగా, పెగాసస్ వివాదం, వ్యవసాయ చట్టాలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలూ షెడ్యూల్కు ముందే బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
