Nimisha Priya: నిమిష ప్రియ ఉరిశిక్ష కేసులో బిగ్‌ట్విస్ట్.. ఆమె ఉరిశిక్ష రద్దుకాలేదు.. ఆ వార్తలన్నీ అవాస్తవమన్న ప్రభుత్వ వర్గాలు

భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యెమెన్ లో ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి.

Nimisha Priya

Nimisha Priya: భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యెమెన్ లో ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఆ వార్తలన్నీ అవాస్తవమని, నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు మంగళవారం ఉదయం వెల్లడించాయి.

Also Read: Nimisha Priya: నిమిష ప్రియకు భారీ ఊరట.. ఉరిశిక్షను రద్దుచేస్తూ యెమెన్ సర్కార్ నిర్ణయం..

యెమెన్‌లో స్థానిక వ్యక్తి హత్యకేసులో నిమిష ప్రియ మరణ శిక్ష ఎదుర్కొంటుంది. షెడ్యూల్ ప్రకారం జూలై 16న ఆమెకు మరణ శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే, భారత విదేశాంగ శాఖ విజ్ఞప్తుల మేరకు.. మృతుడి కుటుంబ సభ్యులతో చర్చల ద్వారా శిక్ష నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం కల్పించాలని కోరవడంతో యెమెన్ ప్రభుత్వం నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే, ఆమె ఉరిశిక్ష రద్దయినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ, కాంతపురం ఏపీ అబూబక్కర్ ముస్లియూర్ కార్యాలయం సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.

“గతంలో తాత్కాలిక వాయిదా వేయబడిన నిమిషా ప్రియ మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసింది. సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తాత్కాలికంగా గతంలో సస్పెండ్ చేయబడిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని వారు నిర్ణయించారు.’’ అంటూ భారత గ్రాండ్ ముఫ్తీ, కాంతపురం ఏపీ అబూబక్కర్ ముస్లియూర్ కార్యాలయం తెలిపింది.

తాజాగా.. ఈ ప్రకటనపై కేంద్రం స్పందించింది. నిమిష మరణ శిక్ష రద్దు అయినట్లు వస్తోన్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపారు. దీంతో నిమిష ప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.