Asaduddin Owaisi: కర్ణాటకలో ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8వ తేదీ సాయంత్రంకు ప్రచారానికి తెరపడనుంది. దీంతో రాష్ట్రంలోని పార్టీల నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ అగ్రశ్రేణి నేతలు ప్రచారంలో పాల్గొంటుండగా.. కాంగ్రెస్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈక్రమంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రచారపర్వాన్ని హీటెక్కించారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభ్యర్థుల విజయంకోసం ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఈక్రమంలో శనివారం హుబ్బళ్లిలో ఓ ర్యాలీలో ఒవైసీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టర్కు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సోనియాగాంధీ జగదీశ్ షెట్టర్ నియోజకవర్గంలో ఆయన విజయంకోసం ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒవైసీ సోనియాగాంధీపై విమర్శలు చేశారు.
Madam Sonia Gandhi ji, mujhe aapse ye ummid nahi thi ki aap ek @RSSorg ke aadmi ke liye campaign karne aayengi, Jagadish Shettar to RSS se hai. – Barrister @asadowaisi #Karnataka #hubli #OwaisiInKarnataka #KarnatakaAssemblyElection2023 #KarnatakaElections2023 pic.twitter.com/XxKFeHE57v
— AIMIM (@aimim_national) May 7, 2023
‘ మేడమ్ సోనియాగాంధీ జీ’ మీరు ఆర్ఎస్ఎస్కు చెందిన వారికోసం ప్రచారానికి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. జగదీశ్ షెట్టర్ ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తిగా పిలువబడతాడు. అతని తరపున ప్రచారం చేస్తారని నేను ఊహించలేదని ఒవైసీ అన్నారు. ఇదేనా మీ సెక్యులరిజం, మోదీని ఇలాగే ఎదుర్కోవాలా? అంటూ ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటంలో ఓడిపోయింది. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఏఐఎంఐఎం బీజేపీకి బీ టీంగా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.