Tamil Nadu Politics: జయలలిత వారసుడు పళనిస్వామే..! సుప్రీంకోర్టులో పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బ..
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో వారసత్వ పోరుకు సుప్రీంకోర్టు ఫుల్స్టాప్ పెట్టింది. సుప్రీం తీర్పుతో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పళని స్వామిని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ అంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
- Harishth Thanniru
- Published On : February 23, 2023 / 12:04 PM IST
Tamil Nadu Politics
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో వారసత్వ పోరుకు సుప్రీంకోర్టు ఫుల్స్టాప్ పెట్టింది. సుప్రీం తీర్పుతో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పళని స్వామిని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ అంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. గురువారం జస్టిస్ దినేష్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం 2022 జూలై 11న సాధారణ కౌన్సిల్ సమావేశంలో పార్టీ బైలాస్కు చేసిన సవరణలకు సంబంధించిన క్రాస్ పిటీషన్ల బ్యాచ్లో తీర్పును ప్రకటించింది.
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామిల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. పన్నీరు సెల్వం, పళని స్వామి ఇద్దరూ ఉమ్మడి పార్టీ బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే, గతేడాది జూలైలో జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో బహు నాయకత్వాన్ని కౌన్సిల్ రద్దు చేసింది. అదే కౌన్సిల్లో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ, పన్నీరు సెల్వం హైకోర్టులో సవాల్ చేసిన విషయం విధితమే. అయితే, హైకోర్టులో పన్నీరు సెల్వంకు ఎదురుదెబ్బ తగిలింది. కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలను మద్రాసు హైకోర్టు సమర్ధిస్తూ తీర్పునిచ్చింది.
మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పన్నీరు సెల్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పలుసార్లు వాదనల అనంతరం సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. మద్రాసు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు వెల్లడించడంతో పన్నీరు సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుప్రీంకోర్టుసైతం జయలలిత వారుసుడు పళని స్వామియే అన్నట్లు తీర్పునిచ్చింది.
