Parliament Insulted పెగసస్ వ్యవహారంపై పార్లమెంటులో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. విపక్షాల చర్యల కారణంగా ప్రతి రోజూ ఉభయసభలు వాయిదాపడుతుంటం రాజ్యాంగాన్ని,ప్రజాస్వామ్యాన్ని మరియు ప్రజలను అవమానించడమేనని అన్నారు. విపక్షాలు ఎంత గందరగోళం చేసినా పార్టీ ఎంపీలు మాత్రం సంయమనం పాటించాలని, సభా గౌరవాన్ని కాపాడాలని బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు.
గత వారం ఐటీ శాఖ మంత్రి చేతుల్లోని పెగాసస్ అంశానికి సంబంధించిన పేపర్లను టీఎంసీ ఎంసీ సంతాను సేన్ లాక్కొని చింపివేసిన ఘటనను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావిస్తూ…సభలో బిల్లులు ఆమోదించే సమయంలో విపక్ష సభ్యులు పేపర్లను చింపివేయడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం లాంటి చర్యలు పార్లమెంట్, రాజ్యాంగాన్ని హేళన చేయడమేనని అన్నారు. సభలో పేపర్లు చించి విసరడం, తమ వైఖరికి క్షమాపణ కూడా చెప్పకపోవడం అహంకారమని ప్రధాని అన్నారు.
పార్లమెంటులో బిల్లులను చర్చించకుండానే ఆమోదించడంపై టీఎంసీ సీనియర్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రధాని తప్పుబట్టారు. పార్లమెంటులో బిల్లుల ఆమోదం చాట్ తయారు చేయడమా అంటూ ట్విట్టర్ ద్వారా డెరెక్ ఒబ్రెయిన్ వ్యాఖ్యానించడం.. ఎంపీలను ఎన్నుకున్న ప్రజల్ని అవమానించడమేనని మోదీ అన్నారు.
పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి,రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా డెరెక్ ఒబ్రెయిన్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వం అన్ని బిల్లుల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉందని … తాము హడావిడిగా బిల్లులను ఆమోదించాలనుకోవడం లేదని ప్రహ్లాద్ జోషి తెలిపారు. తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ పార్లమెంటును అవమానించాడని..ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని జోషి అన్నారు. ఇక, వైద్య, దంత కళాశాలల్లో ఓబీసీ కోటాకు ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ స్వాగతించినట్లు ప్రహ్లాద్ జోషీ తెలిపారు.
మరోవైపు, ఇవాళ కూడా పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు యథావిధిగా కొనసాగాయి. పెగసస్పై చర్చకు పట్టుబడుతూ సభ్యులు నినాదాలు చేయడం వల్ల ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సాగు చట్టాలు, ధరల పెరుగుదలపైనా చర్చించాలని సభ్యులు డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళ నేపథ్యంలో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగి..చివరకి బుధవారానికి సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే, సభలో ప్రతిష్టంభనపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విపక్షం కలిసి ఈ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.
కాగా,ఇవాళ గందరగోళ పరిస్థితుల మధ్యే ఉభయ సభలు ఒక్కో బిల్లుకు ఆమోదముద్ర వేశాయి. లోక్సభలో విపక్షాల ఆందోళనల మధ్యే ఇవాళ ట్రైబ్యునల్స్ రీఫార్మ్స్ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభ.. దివాలా స్మృతి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు జులై 28నే లోక్సభ ఆమోదం పొందింది.