Parliament Winter Session : పార్లమెంట్ ఆవరణలో ఆల్ పార్టీ మీటింగ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
- kunduru Vinod
- Published On : November 28, 2021 / 12:56 PM IST
Parliament Winter Session
Parliament Winter Session : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి.. రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్ , కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజాన్ చౌదరి, ఆనంద్ శర్మ, వైసీపీ తరపున విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, టీఆర్ఎస్ తరపున ఎంపీ నామా నాగేశ్వరరరావు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరింది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యుటివ్ కమిటీ సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించి ఖరారు చేయనున్నారు నేతలు. కాగా రేపటి సమావేశానికి అందరు తప్పనిసరిగా హాజరు కావాలని బీజేపీ తమ ఎంపీలకి సూచించింది. మరోవైపు సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ నేతలు భేటీ కానున్నారు.
మరోవైపు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలను సిద్ధం చేశాయి. రైతు ఉద్యమం, పెట్రోల్ ధరలు.. నిత్యావసరాల పెరుగుదల వంటి అంశాలపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు ప్రతిపక్ష పార్టీల నేతలు. తెలంగాణ ఎంపీలు వరిధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సభలో లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. ఏపీ ఎంపీలు పెండింగ్ బిల్లుల అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కేంద్రప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది.
