Jahangirpuri: జహంగిర్ పురిలో శాంతి ర్యాలీ
వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
- Narender Thiru
- Published On : April 24, 2022 / 08:21 PM IST
Jahangirpuri
Jahangirpuri: ఢిల్లీలోని జహంగిర్ పురిలో హనుమాన్ జయంతి సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. చివరకు నిందితుల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చిన సమయంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఘర్షణల నేపథ్యంలో అక్కడ జరిగిన కూల్చివేతలు కూడా ఉద్రిక్తతకు దారితీశాయి. ఇలా వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది.
ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ‘తిరంగా యాత్ర’ పేరుతో హిందూ, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో జహంగిర్ పురిలో శాంతి ర్యాలీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ర్యాలీ జరగడం విశేషం. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు పోలీసులు ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేసి, ర్యాలీకి ప్రతిపాదించారు. దీంతో ఇరువర్గాలకు చెందిన నాయకుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. తాము ఈ ప్రాంతంలో ఎలాంటి ఘర్షణల్ని కోరుకోవడం లేదని, శాంతిని మాత్రమే కోరుకుంటున్నామని నాయకులు చెప్పారు.
