Hydrogen Train: పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన మోదీ

తొలి దశలో భాగంగా ఈ హైడ్రోజన్ రైలు(Hydrogen Train) ఉత్తర రైల్వే పరిధిలోని జింద్‌-సోనిపత్‌ సెక్షన్‌ మధ్య 89 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది.

PM Modi launches the country first hydrogen train.

  • దేశంలో తొలి హైడ్రోజన్ రైలు
  • జెండా ఊపిన పీఎం మోదీ
  • కాలుష్య రహిత విప్లవాత్మక ప్రయాణం

Hydrogen Train: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా భారత రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. కాలుష్య రహిత ప్రజా రవాణా దిశగా అడుగులు వేస్తూ దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు విజయవంతంగా పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విప్లవాత్మక రైలును జెండా ఊపి ప్రారంభించారు. హరిత ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ భారత రైల్వేలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ మారిన పసిడి ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే?

తొలి దశలో భాగంగా ఈ హైడ్రోజన్ రైలు(Hydrogen Train) ఉత్తర రైల్వే పరిధిలోని జింద్‌-సోనిపత్‌ సెక్షన్‌ మధ్య 89 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. మొత్తం 10 కోచ్‌లతో, ఏకకాలంలో సుమారు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో ఈ రైలును రూపొందించారు. మార్గమధ్యంలో ఇది 12 స్టేషన్లలో ఆగుతుంది. సాధారణ విద్యుత్ రైళ్లు పైన ఉండే వైర్ల నుండి పవర్ సేకరిస్తే, ఈ రైలు మాత్రం తనలోని ‘ప్రొటాన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మెంబ్రేన్‌ ఫ్యూయెల్‌ సెల్‌’ ద్వారా సొంతంగానే కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. దీని ప్రొపల్షన్‌ వ్యవస్థ 3,200 హెచ్‌పీ సామర్థ్యం కలిగి ఉండి, గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఈ టెక్నాలజీలో.. హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక వల్ల కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడతాయి. ఎటువంటి కర్బన ఉద్గారాలు, పొగ రాకపోవడమే కాకుండా ఇది శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం అత్యంత నాణ్యమైన ఆటోమేటిక్ షట్‌ఆఫ్, బహుళ అంచెల లీకేజీ సెన్సార్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా వంటి కొన్ని దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా ఈ అరుదైన సాంకేతికతతో నిలిచింది. త్వరలోనే దీనిని కల్కా-శిమ్లా వంటి చారిత్రక రైల్వే మార్గాల్లోనూ ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.