అవమానించిన ఎంపీలకు టీ ఇవ్వడం వ్యక్తిత్వానికి నిదర్శనం, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం

  • Publish Date - September 22, 2020 / 11:41 AM IST

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ను ప్రధాని మోడీ ప్రశంసించారు. తనను అవమానించిన ఎంపీలకు టీ ఇవ్వడం హరివంశ్‌ గొప్పతనమన్నారు. హరివంశ్ ప్రవర్తన ప్రతి ప్రజాసామ్య ప్రేమికుడు గర్వించేలా ఉందన్నారు.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కొంతమంది ఎంపీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై దాడికి ప్రయత్నించారు. బిల్లులను చింపి ఆయనపై విసిరారు. దాంతో డిప్యూటీ చైర్మన్‌పై దాడికి పాల్పడిన వారిని చైర్మన్ వెంకయ్యనాయుడు సోమవారం(సెప్టెంబర్ 21,2020) సస్పెండ్ చేశారు. అయితే సస్పెండయిన ఎనిమిది మంది ఎంపీలు.. సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాత్రంతా రాజ్యసభ ఆవరణలోనే ధర్నాకు దిగారు. వారికి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం(సెప్టెంబర్ 22,2020) ఉదయం స్వయంగా టీ మరియు స్నాక్స్ తీసుకెళ్లి ఇచ్చారు. అయితే ఎంపీలంతా హరివంశ్ నుంచి టీ తీసుకోవడానికి నిరాకరించారు. నిరసన దీక్షను పక్కదోవ పట్టించేందుకు ఇది హరివంశ్ వేసిన ఎత్తుగడ అని అన్నారు.



తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఓబ్రెయిన్, ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్, కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ సతవ్, రిపున్ బోరా, సయ్యద్ నాసిర్ హుస్సేన్, సీపీఎంకు చెందిన కేకే రాగేశ్, ఎలమారామ్ కరీమ్‌, టిఎంసీకి చెందిన డోలా సేన్‌లు తమ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా సోమవారం రాత్రి పార్లమెంటు పచ్చిక బయళ్లలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పడుకున్నారు. ప్లకార్డులు కూడా ఏర్పాటుచేశారు. హరివంశ్ మమ్మల్ని సహోద్యోగిగా కలుసుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా కాదు. ఆయన మా కోసం టీ మరియు స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. ఇదంతా డ్రామా అని విపక్ష ఎంపీలు అన్నారు.

‘మేము ధర్నా చేస్తున్నది టీ కోసం కాదు. మేమంతా డిప్యూటీ చైర్మన్‌ను గౌరవిస్తాము. ధర్నా తర్వాత మేమంతా ఆయనను టీ కోసం ఆహ్వానిస్తాము’ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ అన్నారు.

కాగా.. సస్పెండైన ఎంపీలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ స్వయంగా టీ తీసుకెళ్లి అందించడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. తనపై దాడికి ప్రయత్నించి, అవమానించి, ధర్నా చేస్తున్న వారికి టీ సర్వ్ చేయడం హరివంశ్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని ప్రధాని అన్నారు. ‘శతాబ్ధాలుగా బీహార్… ప్రజాస్వామ్య విలువలను బోధిస్తోంది. దానికి అనుగుణంగానే విపక్ష ఎంపీలతో హరివంశ్ ప్రవర్తించిన తీరు స్పూర్తి దాయకంగా నిలుస్తోంది. ఈ ఘటన ప్రతి ప్రజాస్వామ్య ప్రేమికుడు గర్వించేలా చేస్తుంది. ఈ సందర్భంగా హరివంశ్‌కు అభినందనలు తెలుపుతున్నా’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.



మరోవైపు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ నారాయణ్ ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తున్నారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సభలో ప్రతిపక్ష ఎంపీలు తనతో ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఉపవాస దీక్షకు దిగారు. ఒకరోజు దీక్ష చేయనున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌కు ఉపసభాపతి లేఖ రాసారు. మరోవైపు హరివంశ్ నారాయణ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ కు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సభలో ఎంపీలు తనతో వ్యవహరించిన తీరుపై లేఖ ద్వారా రాష్ట్రపతికి ఆయన ఫిర్యాదు చేశారు.