PM Narendra Modi: రెండో రోజు గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ: అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బుధవారం కూడా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ లోని బనస్కాంత, జామ్నగర్ దాహోద్లలో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నార
- Bharath Reddy
- Published On : April 19, 2022 / 07:59 AM IST
Modi
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీనగర్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన మోదీ, భవిష్యత్తు ఎంపికలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. బుధవారం కూడా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ లోని బనస్కాంత, జామ్నగర్ దాహోద్లలో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ కూడా ప్రధాని మోదీతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. టెడ్రోస్ తో కలిసి జామ్నగర్లో WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (GCTM) భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం బనస్కాంతలోని బనాస్ డెయిరీ కాంప్లెక్స్లో కొత్త డెయిరీ కాంప్లెక్స్, పొటాటో ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త డెయిరీ కాంప్లెక్స్ బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. వ్యవసాయం పశుపోషణకు సంబంధించిన కీలకమైన శాస్త్రీయ సమాచారాన్ని రైతులకు అందించడానికి ఏర్పాటు చేసిన బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ అనంతరం రేడియో స్టేషన్ను జాతికి అంకితం చేయనున్నారు. 1700 గ్రామాలకు చెందిన 5 లక్షల మంది రైతులకు ఈ రేడియో స్టేషన్ ద్వారా సమాచారం అందించనున్నారు.
Also Read:YSRCP: వైసీపీలో సంస్థాగత పదవుల పంపకం.. నేడు తుది జాబితా!
