Goa Chief Minister: గోవా సీఎంగా కొనసాగనున్న ప్రమోద్ సావంత్
బీజేపీ నేత, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి(ఆపద్ధర్మ) ప్రమోద్ సావంత్ నే సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
- Bharath Reddy
- Published On : March 21, 2022 / 08:22 PM IST
Pramod
Goa Chief Minister: గోవా ముఖ్యమంత్రి పీఠం అభ్యర్థి పై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ నేత, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి(ఆపద్ధర్మ) ప్రమోద్ సావంత్ నే సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గోవా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ ఎంపీ నరేంద్ర తోమర్ సోమవారం నాడు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. తనను రెండోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అధిష్టానానికి, ప్రధాని నరేంద్ర మోదికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సీఎం అభ్యర్థిగా పేరును కేంద్రపెద్దలకు సిఫారసు చేసిన ఎమ్మెల్యేలకు ప్రమోద్ సావంత్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అవలంబిస్తున్న అభివృద్ధి కోణాన్ని రాష్ట్రంలోనూ అమలుపరుస్తానని..ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.
Also Read:Prisoners to Priests: పురోహితులుగా సెంట్రల్ జైల్లో శిక్షణ తీసుకుంటున్న ఖైదీలు
సీఎం అభ్యర్థిత్వాన్ని నిర్ణయయించేందుకు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ నరేంద్ర సింగ్ తోమర్ ఆద్వర్యంలోని బీజేపీ జాతీయ బృందం సోమవారం గోవాకు చేరుకుంది. వీరితోపాటుగా గోవా రాష్ట్ర బీజేపీ ఇంచార్జి దేవేంద్ర ఫడ్నవిస్, ఇతర నేతలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశ అనంతరం నరేంద్ర తోమర్ మాట్లాడుతూ సీఎం అభ్యర్థిగా ప్రమోద్ సావంత్ ను బీజేపీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, దీంతో తమపని చాలా సులువైందని తెలిపారు. అతిత్వరలో గోవాలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్తనాలకుగానూ బీజేపీ అభ్యర్థులు 20 స్థానాల్లో గెలుపొందారు. సీఎంగా ప్రమోద్ సావంత్ కు ఇది రెండో పర్యాయంకాగా, బీజేపీ వరుసగా మూడు సార్లు గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read: MLA Jagga Reddy : జగ్గారెడ్డికి హైకమాండ్ షాక్.. ఆ బాధ్యతల నుంచి తొలగింపు
