Congress protest rally: ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నేడు తలపెట్టిన నిరసన ర్యాలీకి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. రామ్ లీలా మైదానంలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఈ ప్రాంగణానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర ముఖ్యనేతలు రానున్నారు. నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ పెరుగుదల వంటి సమస్యలపై కాంగ్రెస్ ఈ నిరసన తెలపనుంది. కేంద్ర సర్కారు తీరు వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇవాళ నిర్వహించే ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర నేతలు ప్రసంగిస్తారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 7 నుంచి కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ యాత్రను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు (3,500 కిలోమీటర్ల మేర) నిర్వహిస్తారు. దీనికి ముందు రామ్ లీలా మైదానంలో నిరసన తెలుపుతుండడం గమనార్హం.
ప్రస్తుతం సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. సోనియాతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, ఆమె కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. అయితే, సోనియా, ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ నిరసనలో పాల్గొనే అవకాశం లేదు. రాహుల్ మాత్రమే నిన్న తిరిగి భారత్ వచ్చారు. నేడు నిర్వహిస్తోన్న యాత్రలో పాల్గొంటారు.