Farm Laws Repeal : సాగు చట్టాల రద్దు బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్లో పేర్కొన్నారు.
- venkaiahnaidu
- Published On : December 1, 2021 / 09:51 PM IST
Kovind
Farm Laws Repeal : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్లో పేర్కొన్నారు. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యింది.
కాగా,గత నెల 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజునే లోక్ సభ,రాజ్యసభ ఒకేరోజు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేసినప్పటికీ లోక్సభలో కేవలం నాలుగు నిమిషాల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో స్వల్ప చర్చ అనంతరం ఈ బిల్లును ఆమోదించారు.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మూడు వ్యవసాయ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించింది. ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టం 2020, రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పందం, రైతుల ఉత్పత్తి వాణిజ్యం, వాణిజ్యం (ప్రమోషన్ , సులభతరం) చట్టం 2020, నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం 2020ను తెచ్చింది. ఈ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిపైగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. గత నెలలో ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాకుండా రైతులకు మోదీ క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.
మరోవైపు,వ్యవసాయ చట్టాలను రద్దు చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర(MSP)పై చట్టం సహా పలు డిమాండ్లపై కేంద్రం రాతపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతు సంఘాలు బుధవారం తేల్చి చెప్పాయి.
ALSO Farmers : డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమణ
