Prime minister Modi Key Comments on India Alliance
Prime minister Modi : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈసారి బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు గెలుచుకుంటుందన్న ఆయన.. అందుకోసం ఓ ఫార్ములా కూడా చెప్పారు. ఇక ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ టార్గెట్గా కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ.. ఎన్నికల తర్వాత విపక్ష కూటమి కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.
మధ్యప్రదేశ్లోని ఝబువా వేదికగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. 7వేల 550 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన జన జాతీయ మహాసభలో ప్రసంగించారు. తాను ఓట్లు అడగడానికి రాలేదన్న మోదీ.. బీజేపీని గెలిపించిన మధ్యప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చానన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటుతాయని విపక్షాలు సైతం అంటున్నాయని.. బీజేపీ సింగిల్గానే 370 సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. పదేళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు డబుల్ ఇంజిన్ సర్కారు కృషి చేస్తోందని తెలిపారు మోదీ.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేయడంతో పాటు.. దానికి ఓ ఫార్ములా సైతం చెప్పారు మోదీ. ఎన్డీయే సర్కారు చేసిన అభివృద్ధి, తీసుకువచ్చిన సంస్కరణలు ప్రజలకు వివరించి.. ఈసారి ఒక్కో పోలింగ్ బూత్లో 370 ఓట్లు బీజేపీకి ఎక్కువగా పడేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గిరిజనుల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్ కూటమి.. ఎన్నికల తర్వాత కనుమరుగు కావడం ఖాయమన్నారు మోదీ. తాను చేసిన పాపాల నుంచి బయటకు వచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏనాడూ సఫలం కావన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం.. అడ్డువస్తే అన్నీ కూల్చేయడమే కాంగ్రెస్కు ఆక్సిజన్ అని ఎద్దేవా చేశారు ప్రధాని.
మొత్తంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మరోసారి ధీమా వ్యక్తం చేసిన మోదీ… కాంగ్రెస్ రాజకీయాలపై విరుచుకుపడ్డారు.