కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది.. ఈసారి 40 సీట్లు కూడా రావు: ప్రధాని మోదీ

దేశాన్ని మరోసారి విభజించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.

Prime Minister Narendra Modi Slams Congress in Rajya Sabha

Naredra Modi: చూస్తుండగానే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని మరోసారి విభజించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణం అంటూ విడదీసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, వేర్పాటు వాదం పెరిగిపోయాయని దుయ్యబట్టారు. మీడియా స్వేచ్ఛను కాంగ్రెస్ కాలరాసిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీని ఓ ఆంగ్లేయుడు స్థాపించారని, ఇప్పటికీ ఆ పార్టీపై బ్రిటిషర్ల ప్రభావం ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ భాషలను చిన్నచూపు చూసి ఇంగ్లీషును ప్రోత్సహించారని ఆరోపించారు. బ్రిటిష్ ఎలా నడిస్తే అలా భారత పార్లమెంట్ ను నడిపారని పేర్కొన్నారు. బానిసత్వ గుర్తులను తాము చెరిపేస్తున్నామని చెప్పారు. నెహ్రు రిజర్వేషన్లను వ్యతిరేకించారని, రుజువులు కావాలంటే రికార్డులు చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కితే ఉద్యోగాల్లో నైపుణ్యత దెబ్బతింటుందని నెహ్రు భావించారని వెల్లడించారు. ఆదివాసీలు, దళితులు అంటే హస్తం పార్టీకి గిట్టదన్నారు. అంబేద్కర్ లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కేవి కాదని అభిప్రాయపడ్డారు. ఆయనకు కాంగ్రెస్ భారతరత్న ఇవ్వలేదని, తమ హయాంలోనే దేశ అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రకటించామని గుర్తు చేశారు. తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసింది బీజేపీ అని పునరుద్ఘాటించారు.

Also Read: ఉమ్మడి పౌరస్మృతి లక్ష్యం ఏంటి.. మన దేశంపై చూపే ప్రభావం ఎంత..?

దేశ సైనికుల కోసం ఒక్క మెమోరియల్ కూడా కాంగ్రెస్ కట్టలేదన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశ ఆర్థికవ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చామని, దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి తాము బయట పడేశామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ విదేశీ వస్తువులను ప్రోత్సహిస్తే తాము మాత్రం మేకిన్ ఇండియాను ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. రైతులు, యువత, మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ఎల్ఐసీ మూత పడుతుందని కాంగ్రెస్ విమర్శలు చేసిందని.. కానీ ఇప్పుడు ఎల్ఐసీ షేర్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయని తెలిపారు.