పాపులర్ ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్ జీ(PUBG) ఆడినందుకు 10మంది యువకులను అరెస్ట్ చేశారు రాజ్ కోట్ పోలీసులు. పబ్జీకి యువత అడిక్ట్ అవుతుండడంతో వారిని అరెస్ట్ చేసినట్లుగా రాజ్కోట్ పోలీస్ కమీషనర్ మనోజ్ అగర్వాల్ పబ్జీ ఆడరాదంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గుజరాత్లోని రాజ్కోట్లో మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు గవర్నమెంట్ పబ్జీని బ్యాన్ చేసినట్లుగా ప్రకటించింది. అయినా కూడా ఆడిన 10మందిని రాజ్కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి మీద సెక్షన్ 188కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు బెయిల్ ఇచ్చుకునే అవకాశం ఉండడంతో వారిని అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేశారు. ఈ కేసులో వాళ్లు కోర్టుకు నేరుగా హాజరుకావలసి ఉంటుందని పోలీస్ కమీషనర్ మనోజ్ అగర్వాల్ వెల్లడించారు. అయితే పట్టుకున్న వారిలో జాబ్ చేసే వాళ్లు ముగ్గురు ఉండగా.. గ్రాడ్యుయేట్ చేసి జాబ్ వెతుక్కుంటున్న వ్యక్తి ఒకరు.. ఆరుగురు కాలేజ్ విద్యార్ధులు ఉన్నారు. వారి ఫోన్లను తదుపరి విచారణ కోసం పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు.
అరెస్ట్ అయినవారి ఫోన్లోని హిస్టరీని చెక్ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. పబ్జీకి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. పబ్జీ గేమ్ని భారత్ లో నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.